Begin typing your search above and press return to search.

బాబు ‘సోషల్’ ప్రశ్నలతో మంత్రులు షాక్

By:  Tupaki Desk   |   27 July 2016 11:30 AM GMT
బాబు ‘సోషల్’ ప్రశ్నలతో మంత్రులు షాక్
X
క్యాబినెట్ సమావేశం అంటే ఎలా ఉంటుంది? ఏయే అంశాలు చర్చకు వస్తాయి? ఈ సమావేశంలో మంత్రుల ఎలా వ్యవహరిస్తారు? మంత్రుల్ని ముఖ్యమంత్రి ఏమేం ప్రశ్నలు అడుగుతారు? మీటింగ్ మొత్తం వన్ సైడ్ బ్యాటింగా? లాంటి డౌట్లు చాలామందికి వస్తుంటాయి. ముఖ్యమంత్రి తీరును అనుసరించి మంత్రివర్గ సమావేశం నడిచే పరిస్థితి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో క్యాబినెట్ మీటింగ్ అంటే.. రాజన్న నిర్ణయాలు తీసుకోవటమే కానీ వాటి గురించిన చర్చ ఉండేది కాదు.

వీలైనంతవరకూ రాజకీయ అంశాల మీదనే చర్చ జరిగేది. ఏదైనా కొత్త పథకాలు లాంటివి షురూ చేయాలంటే మాట వరసకు చెప్పేవారు. వైఎస్ మీద అసమ్మతితో ఉన్నప్పటికీ ఆయనకున్న ప్రజాదరణతో పెద్ద మాటలు ఉండేవి కాదు. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య క్యాబినెట్ మీటింగ్ అంటే.. సీనియర్లు చెలరేగిపోయేవారు. ఆయన మాటను అస్సలు లక్ష్యపెట్టేవారు కాదు. సున్నితమైన వ్యక్తిగా ఉండటం.. బలమైన సామాజిక నేపథ్యం లేకపోవటంతో ఆయన్ను చికాకు పెట్టేలా వ్యవహరించే నేతలెందరో. దీనికి తోడు జగన్ అండతో చెలరేగిపోయిన మంత్రులు కూడా తక్కువేం కాదు.

తర్వాతి కాలంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి ముందు కూడా తోక జడించాలని ట్రై చేయటం.. అలాంటి వారికి ఆయన తనదైన శైలిలో షాక్ ఇవ్వటం లాంటివి చోటు చేసుకున్నాయి. అయితే.. కిరణ్ కు కూడా కొందరి మంత్రుల నుంచి సహాయ నిరాకరణ ఉండేది. ఇక.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరు చంద్రుళ్ల వ్యవహారం దాదాపు ఒకేలా ఉంటుందని చెప్పాలి. కాకుంటే.. కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ అంటే.. వినసొంపుగా ఉండే మాటలతో అలా నడిచిపోతే.. బాబు నేతృత్వంలో జరిగే క్యాబినెట్ మీటింగ్ కాస్త బోరింగ్ అని చెబుతారు.

ఇద్దరు నేతలకూ బలమైన ప్రజాబలం ఉండటంతో మంత్రులు ఎవరూ వారిద్దరి మాటకు ఎదురుచెప్పే ధైర్యం చేయని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర అంశం చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి ఊహించని విధంగా వచ్చిన ప్రశ్నలకు మంత్రులు పలువురు తడబాటుకు గురైనట్లుగా చెబుతున్నారు. ఫేస్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చిన చంద్రబాబు.. మంత్రుల్లో ఎంతమందికి ఫేస్ బుక్ అకౌంట్లు ఉన్నాయని ప్రశ్నించగా.. అందరూ తమకు అకౌంట్లు ఉన్నాయని చెప్పారట. అంతవరకూ బాగానే ఉన్నా.. ఈ అంశం మీద బాబు అడిగిన పలు ప్రశ్నలకు చాలామంది మంత్రుల నుంచి సమాధానం లేదని చెబుతున్నారు.

ఎంతమంది మంత్రులు తమ అకౌంట్లను అప్ డేట్ చేస్తున్నారని.. రోజూ ఎన్ని అప్ డేట్స్ చేస్తున్నారని అడగ్గా.. మంత్రులు గంటా.. అచ్చెన్నాయుడు సమర్థంగా బదులు చెప్పినట్లుగా చెబుతున్నారు. తన ఫేస్ బుక్ ఖాతాలో 70 వేలమంది ఫాలోయర్స్ ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు చెబితే.. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం తన అకౌంట్లో 50 మంది ఫాలోయర్స్ ఉన్నట్లు చెప్పారు. సోషల్ మీడియాతో యూత్ కు మరింత దగ్గరకావొచ్చని.. ఆ దిశగా అందరూ ప్రయత్నాలు మొదలెట్టాలని బాబు సూచించారు. ముఖ్యమంత్రి నోట్లో నుంచి వచ్చిన సోషల్ మీడియా ముచ్చట పలువురు మంత్రుల్ని ఉక్కిరిబిక్కిరి చేసినట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో బాబు నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సోషల్ మీడియా మీద ప్రశ్నలు కూడా ఉంటాయన్న మాట.