Begin typing your search above and press return to search.

అమరావ‌తికి మ‌హానాడులో అవ‌మానం చేశారా?

By:  Tupaki Desk   |   28 May 2017 5:18 AM GMT
అమరావ‌తికి మ‌హానాడులో అవ‌మానం చేశారా?
X
అమ‌రావ‌తి...న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని, ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు క‌ల‌ల స్వ‌ప్నం. ఆయ‌న ప్ర‌సంగం ఏదైనా, ఎక్క‌డైనా అమ‌రావ‌తి ప్ర‌స్తావ‌న లేకుండా ఉండ‌దు. అలాంటి అమ‌రావ‌తికి తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మ‌హానాడులో జాడ కనిపించ‌నేలేదు. కనీసం అమరావతి ప్రస్తావన లేకుండానే తొలిరోజు మహానాడు ముగియడం గమనార్హం. విశాఖలో అట్టహాసంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో చంద్రబాబు స్వప్నసౌధం ప్ర‌స్తావ‌న లేకుండా ఇలా మొద‌టి రోజే ముగియ‌డం చ‌ర్చ‌నీయాంశం.

రాష్ట్ర రాజధాని అమరావతిని భారీ స్థాయిలో నిర్మించాలని చంద్రబాబు మూడు సంవత్సరాలుగా తపన పడుతున్నారు. రాజధాని డిజైన్ల కోసం ఆయన సుమారు అర డజను దేశాల ఆర్కిటెక్ట్‌లు గీసిన డిజైన్లను పరిశీలిస్తూ వస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చి మూడో సంవత్సరం పూర్తవుతున్నా, అమరావతి మాత్రం కొలిక్కి రాలేదు. అయిన‌ప్ప‌టికీ ఈ మూడేళ్లలో చంద్రబాబు పాల్గొన్న ఏ సమావేశం అయినా అమరావతి ప్రస్తావన రాకుండా జరిగిన సందర్భం లేనే లేదు. అమరావతిపై డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్తూ వచ్చిన చంద్రబాబు దాని గురించి స్మరణ చేయకుండా ఉండని రోజు లేదు. అలాంటిది, పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన మహానాడు సంబరంలో కనీసం అమరావతికి సంబంధించి ఒక్క ఛాయాచిత్రాన్ని కానీ, నమూనాని కానీ మహానాడు వేదిక వద్ద ఎక్కడా ఏర్పాటు చేయలేదు. కనీసం అమరావతిలోని బౌద్ధస్థూపాన్ని అయినానా ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం చర్చనీయాంశమైంది.

మ‌హానాడు ప్రధాన వేదికకు ఒకవైపు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, మరోవైపు పోలవరం ప్రాజెక్ట్‌ల నమూనాలను ఉంచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహానాడు కాబట్టి ఈ రెండు నమూనాలను ఇక్కడ ఉంచారని ప‌లువురు చెప్తున్నారు. హైటెక్ సిటీ చంద్రబాబు కృషికి దర్పణమ‌ని, పోలవరం ప్రాజెక్ట్ ఆయన లక్ష్యమ‌ని విశ్లేషిస్తున్న సద‌రు వ‌ర్గాలు.... వీటన్నింటికీ మించి ఆయన మానసపుత్రికగా భావిస్తున్న రాజధాని అమరావతిని వేదిక వద్దకు ఎందుకు తీసుకురాలేకపోయారన్న సంగ‌తిని ప్ర‌స్తావిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఈ విష‌యాన్ని చ‌ర్చించుకోవ‌డం క‌నిపించింద‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/