Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేల‌కు బాబు పెద్ద ప‌రీక్షే పెట్టాడు

By:  Tupaki Desk   |   31 May 2016 5:26 AM GMT
వైసీపీ ఎమ్మెల్యేల‌కు బాబు పెద్ద ప‌రీక్షే పెట్టాడు
X
రాజ్య‌స‌భ ఎన్నిక‌లు రంజుగా మారుతున్నాయి. వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేల‌కు అయితే ఈ ఎన్నిక‌లు ఒక పరీక్ష‌గా మారాయ‌ని చెప్తున్నారు. బ‌లం లేన‌ప్ప‌టికీ నాలుగవ సీటునూ చేజిక్కించుకునేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బాబు కొత్త ఎత్తుగ‌డ వేశారు.

ఇప్పటివరకూ వైసీపీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా, నాలుగవ అభ్యర్ధి విజయం సాధించాలంటే మరో 19 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. ఒక రాజ్యసభ అభ్యర్ధి గెలవాలంటే 36 మంది ఎమ్మెల్యేల బలం కావలసి ఉంది. మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం ఖాయ‌మైంది. అంటే ఇంకా 17 మంది మాత్రమే అవసరం ఉంటుంది. దీనిపై గత వారం నుంచి కసరత్తు చేస్తున్న నాయకత్వం తాజాగా తమ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. అధినేత చంద్రబాబు వారితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పోటీపై చర్చించగా దానికి వారంతా ఆమోదముద్ర వేశారు. దానికి స్పందించిన బాబు, అయితే ఆ బాధ్యతను మీరే తీసుకోవాలని ఎమ్మెల్యేల‌ను ఆదేశించారు. ఆ ప్రకారం వైసీపీ ఎమ్మెల్యేలు జలీల్‌ ఖాన్ - సుజయకృష్ణ రంగారావు - గొట్టిపాటి రవి తదితరులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. తమ పాత సహచరులతో ఓట్లు వేయించే బాధ్యత మీరే తీసుకోవాలని బాబు జంపింగ్ ఎమ్మెల్యేల‌కు సూచించారు. ఆ ప్రకారంగా నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డిప్రభాకర్‌ రెడ్డిని నాలుగవ అభ్యర్థిగా బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం.

పోటీకి సిద్ధంగా ఉండాలని వేమిరెడ్డికి సంకేతాలు కూడా పంపించారని తెలుస్తోంది. వేమిరెడ్డి ప్రస్తుతం అధినేతకు అందుబాటులోనే ఉన్నారు. అయితే, నాలుగవ అభ్యర్ధిపై అస్పష్టత కొన‌సాగుతూనే ఉంది. కొంతమంది సీనియర్లు మాత్రం అది నైతికంగా మంచిదికాదని, గత ఏడాది తెలంగాణ కౌన్సిల్‌ కు జరిగిన ఎన్నికల్లో బలం లేకపోయినా 5వ అభ్యర్ధిని ఎలా దింపారని తమ పార్టీ ప్రశ్నించి, ఇప్పుడు తామూ అదే పనిచేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయని వాదిస్తున్నారు. నాయకత్వం మరోసారి వైసీపీ పాత ఎమ్మెల్యేలతో మాట్లాడి, అభ్యర్ధిని ఖరారు చేస్తారని అంటున్నారు.