Begin typing your search above and press return to search.

డిసెంబరు 5 కోసం బీజేపీ ఎదురుచూపులు

By:  Tupaki Desk   |   28 Nov 2015 9:06 AM GMT
డిసెంబరు 5 కోసం బీజేపీ ఎదురుచూపులు
X
ఏపీ బీజేపీ నేతలు డిసెంబరు అయిదో తేదీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారట. అదేంటి... డిసెంబరు 5వ తేదీకి వారు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారు... బాబ్రీ మసీదును కూల్చివేసిన తేదీ అనుకున్నా అది ఆరో తేదీ... అయినా, కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధేశ్వరి - కావూరి వంటివారికి ఇలాంటి బీజేపీ కీలక తేదీల గురించి తెలిసింది తక్కువే. మరి డిసెంబరు 5వ తేదీకి వారు ఎందుకంత ప్రాధాన్యిమిస్తున్నారు అంటే... అది చంద్రబాబుతో ఏపీ బీజేపీ నేతలు సమావేశం కానున్న రోజు. ఆ రోజు చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకోవాలని పలువురు బీజేపీ నేతలు కత్తులు కటార్లు రెడీ చేసుకుంటున్నారట. చంద్రబాబుతో సమావేశంలో బీజేపీ నేతలుగా టీడీపీతో తాము ఎంత ఇబ్బంది పడుతున్నామో చెప్పాలని వారంతా పాయింట్లు రాసుకుంటున్నారట. టీడీపీ తమను లైట్ గా తీసుకుంటోందని భావిస్తున్న బీజేపీ నేతలు ఆ విషయం చంద్రబాబుతోనే డైరెక్టుగా చెప్పాలని అనుకుంటోంది. అందుకు 5వ తేదీ సమావేశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు వారు.

ఇప్పటికే చంద్రబాబుపై, టీడీపీపై కొందరు బీజేపీ నేతలు విమర్శలు చేశారు. అయినా, చంద్రబాబు దేన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. బీజేపీలోని ఓ వర్గం చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉన్నా సోము వీర్రాజు బృందంలోని కావూరి సాంబశివరావు - కన్నాలక్ష్మీనారాయణ, పురందేశ్వరి తదితరులు టీడీపీ తీరుపై గుర్రుగా ఉన్నారు. అధికారపార్టీలో భాగస్వాములమైనాగాని తమను ఎదగనివ్వడం లేదన్నది వీరి భాధ. చంద్రబాబుతో జరిగే భేటీలో ఇలాంటి విషయాలన్నిటిపైనా మాట్లాడాలని వారు అనుకుంటున్నారట.

అయితే... సోము వీర్రాజు - కావూరి - పురంధేశ్వరి - కన్నా వంటివారు చంద్రబాబుపై ఇప్పటికే స్థాయికి మించి విమర్శలు చేయడంతో డిసెంబరు 5 నాటి సమావేశంలో చంద్రబాబు వారిపట్ల ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ఇంతవరకు సహించిన ఆయన వారికి ఆరోజు గట్టి హెచ్చరికలు జారీచేస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరి బీజేపీ నేతలు గళమెత్తుతారో చంద్రబాబు క్లాసు పీకుతారో చూడాలి.