Begin typing your search above and press return to search.

పోల‌వరం: సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చిన బాబు

By:  Tupaki Desk   |   12 Dec 2017 10:28 AM GMT
పోల‌వరం: సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చిన బాబు
X
పోలవరం...ఈ ప్రాజెక్ట్ ఏపీలో ఇప్పుడో హాట్‌ టాపిక్. ఇటీవల అన్ని పార్టీల నేతలూ పోలవరాన్ని సందర్శించారు. ఎవ్వరికి తోచిన అభిప్రాయాలు వారు చేశారు. ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకున్న సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు దగ్గర ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కాపర్‌ డ్యామ్‌ - డయాఫ్రం వాల్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల తీరును ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డకుంలు సృష్టించినా ప్రాజెక్టు నిర్మాణంలో ఎట్టిపరిస్థితిలో రాజీ పడనని స్పష్టం చేశారు. దీనికి కొనసాగింపుగా ఆయ‌నో సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చారు.

ఏపీకి కీల‌క‌మైన పోలవరం ప్రాజెక్టును ఒడిశా - చత్తీస్‌ గడ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు సుప్రీం కోర్టు దాకా వెళ్లాయి. ఇటీవ‌ల తెలంగాణ ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి ప్ర‌త్యేకంగా భువ‌నేశ్వ‌ర్‌ లో ఒడిశా సీఎంను కూడా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగుదామ‌ని ప్ర‌తిపాదించారు. ఇలా రాజ‌కీయంగా కీల‌క భేటీలు సాగుతున్న స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. ఇవాళ మంత్రులు - శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పోలవరంపై సుప్రీంకోర్టుకు ఒడిశా సర్కార్‌ రాసిన లేఖపై సీఎం ప్రస్తావించారు. ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటామని ఒడిశా సర్కార్‌ సూచిస్తోందన్న అధికారులు చంద్రబాబుకు వివరించారు. పోలవరం నిర్మాణంలో ఇదో కొత్త ట్విస్ట్‌ అని చంద్రబాబు కామెంట్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వస్తున్న అభ్యంతరాలకు ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాల్సింది ప్రధానే అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

సీఎంల సమావేశం ఏర్పాటు చేయాల్సింది ప్రధానేనని - కేంద్రం సీఎంల సమావేశం ఏర్పాటు చేస్తే మనకూ మంచిదేనన్న చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే ఒడిశా - ఛత్తీస్‌ గఢ్‌ ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు చంద్రబాబు తెలిపారు. ఛత్తీస్‌ గఢ్‌ సీఎం ప్రస్తుతం సైలెంట్‌ అయ్యారని - త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు మంచి స్నేహితుడు అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒడిశాలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలవరం ప్రాజెక్టుపై ఆయన అలా చేస్తున్నారని తనకు అనిపిస్తోందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు ఈ సంద‌ర్భంగా అధికారుల‌తో వెల్ల‌డించారు. పోలవరంలో కాంక్రీట్‌ వర్క్స్‌ మినహా ఇతర పనులు వేగవంతం చేశామని - కాంక్రీట్‌ పనులు పూర్తిచేసి కాఫర్‌ డ్యాం నిర్మిస్తే.. వచ్చే ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చన్నారు.

కాగా, మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టులో పోల‌వ‌రంపై విచార‌ణ జ‌రిగింది. మూడు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు కూర్చొని చ‌ర్చించుకొని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించింది. ఈ స‌మ‌యంలోనే సీఎం చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా, సోమ‌వారం పోలవరం ప్రాజెక్టును సంద‌ర్శించిన సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు గంభీర ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. పోల‌వ‌రం ప్రాజెక్టును అడ్డుకోవాలని ఎవరైనా చూస్తే.. చూస్తూ ఊరుకోబోమంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. ఎవరెన్ని కుట్రలు చేసినా అనుకున్న సమయానికి పోలవరం నిర్మించి తీరుతానని మరోసారి శపథం చేశారు.