Begin typing your search above and press return to search.

కాపు ఇష్యూను బీసీతో చెక్ చెప్పిన బాబు

By:  Tupaki Desk   |   9 Feb 2016 11:30 AM GMT
కాపు ఇష్యూను బీసీతో చెక్ చెప్పిన బాబు
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాల్ని ప్రత్యేకించి మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సరిగ్గా దృష్టి సారించాలే కానీ.. ఆయన ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. కాకుంటే.. కొన్ని విషయాల్లో అనవసరమైన తప్పటడుగులు వేసి లేని పోని సమస్యలు కొని తెచ్చుకునే బాబు.. అదే సమయంలో పక్కా ప్లానింగ్ తో ఎంత పెద్ద ఇష్యూనైనా సింఫుల్ గా క్లోజ్ చేయొచ్చన్న విషయాన్ని తాజాగా ముద్రగడ దీక్ష ఇష్యూలో తేల్చేశారు.

దాదాపు వారం రోజులకు పైనే సాగిన కాపుల ఇష్యూను ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం తాత్కలికంగా క్లోజ్ చేశారు.తాను మొదటి నుంచి చెబుతున్న మాటల్నే మరోసారి ముద్రగడ నోటి నుంచి చెప్పించటంలో బాబు సఫలం కావటమేకాదు.. ప్రభుత్వం మొదట్నించి చెప్పిన మాటలకు భిన్నంగా ముద్రగడ దీక్ష విరమణ సమయంలో పెద్ద హామీలేమీ ఇవ్వలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అదే సమయంలో కాపుల రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ సర్కారు సానుకూలంగా ఉందన్న విషయాన్ని కన్ ఫర్మ్ చేసిన బాబు.. అదే సమయంలో బీసీలకు అన్యాయం చేయమన్న విషయాన్ని సమర్థవంతంగా చెప్పటంతో పాటు.. ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నోటి నుంచి చెప్పించే విషయంలోనూ విజయం సాధించారు.

బలహీన వర్గాలు.. ఎస్సీ.. ఎస్టీలకు ఇబ్బంది పెట్టేలా తమకు రిజర్వేషన్లు ఇవ్వొద్దని.. తమ జాతిలోని పేదలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తించేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. క్రీమీలేయర్ ను మొదటి రోజు నుంచే వర్తించేలా చేయాలంటూ తన దీక్షను విరమించిన సమయంలో ముద్రగడ చెప్పటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముద్రగడ తన దీక్షను విరమించేందుకు చంద్రబాబు బీసీ ట్రిక్ ప్రయోగించారు. కాపుల్ని బీసీల్లోకి చేరుస్తూ నిర్ణయం తీసుకోవటం వల్ల బీసీ వర్గాలకు నష్టం వాటిల్లుతుందన్న భావన ఉన్న నేపథ్యంలో.. అలాంటిదేమీ జరగదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. బీసీ నేతల్ని ముద్రగడ దీక్ష విరమింపచేయటానికి పంపి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు.

బీసీలకు నష్టం వాటిల్లేలా చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. అందుకు తమ రాకే నిదర్శనమన్న విషయాన్ని చెప్పే విషయంలో బీసీ తమ్ముళ్లు స్పష్టం చేశారు. ముద్రగడ దీక్ష విరమణకు బీసీ నేతల్ని ప్రయోగించిన చంద్రబాబు మరో విషయంలోనూ తెలివిగా వ్యవహరించారు. సోమవారం ముద్రగడకు మద్దతు పలకటానికి పెద్ద ఎత్తున ఏపీ కాంగ్రెస్ నేతలు కిర్లంపూడికి పయనమయ్యారు. వారందరిని ముద్రగడ వద్దకు వెళ్లకుండా చేసిన ఏపీ సర్కారు.. అదే సమయంలో ముద్రగడ డిమాండ్ల విషయంలో ఏపీ సర్కారు సానుకూలంగా ఉందన్న విషయన్ని ఆయనకు అర్థమయ్యేలా చేయటంలో విజయం సాధించారని చెప్పక తప్పదు. ఈ కారణంతోనే.. కాపుల్ని బీసీల్లో చేర్చే అంశం మీద ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న హామీతో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన ముద్రగడ ఆమరణ దీక్ష ముగియటం గమనార్హం.