Begin typing your search above and press return to search.

నారాయ‌ణ‌ను వాయించేసిన బాబు

By:  Tupaki Desk   |   23 March 2017 6:32 AM GMT
నారాయ‌ణ‌ను వాయించేసిన బాబు
X
ఏపీలో జరిగిన పట్టభద్రులు - ఉపాధ్యాయ ఎన్నికల్లో టీడీపీ ప‌రాజ‌యం పాలు అవ‌డం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధిత ఎన్నిక‌లు జ‌రిగిన ప్రాంతంలోని మంత్రులపైనే ఆరోపణలు చేశారు. మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా మిగ‌తా మంత్రుల కంటే పుర‌పాల‌క మంత్రి నారాయ‌ణ‌కే ఎక్కువగా త‌లంటిన‌ట్లు స‌మాచారం.

ప‌ట్ట‌భ‌ద్రులు - ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మొత్తం ఐదు స్థానాలకు గాను మూడు వామపక్ష అభ్యర్ధులు - ఒకటి ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ గెలుచుకోగా ఒక్క‌ స్థానాన్ని బీజేపీ-తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి గెలుచుకుంది. ఆ ఒక్క‌టి కూడా బీజేపీకి చెందిన రాష్ట్ర అధ్య‌క్షుడు - సిట్టింగ్ ఎంపీ ఉన్న నియోజ‌క‌వ‌ర్గం. ఈ క్ర‌మంలో టీడీపీ ఓట‌మిపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు స్పందిస్తూ మంత్రులు ఆశించిన స్థాయిలో పనిచేయలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. గెలిచే అవకాశాలు ఉన్న చోట కూడా ఓట్లు సంపాదించలేకపోయామని ఆయన విమర్శించారని తెలుస్తోంది. ఈ ఫ‌లితాల వ‌ల్ల‌ పార్టీకి ఇబ్బందులు కలుగుతున్నట్లు కూడా చంద్ర‌బాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. కీల‌కమైన నెల్లూరు - చిత్తూరు జిల్లాలో కూడా పార్టీ ఓడిపోవ‌డం పై బాబు తీవ్రంగా అసంతృప్తి చెందిన‌ట్లు స‌మాచారం. ఈ రెండు జిల్లాల‌కు చెందిన పార్టీ బాధ్యుడైన మంత్రి నారాయ‌ణ స‌రిగా త‌న ప‌నితీరును చూప‌లేద‌ని బాబు ఫైర్ అయిన‌ట్లు చెప్తున్నారు.

మ‌రోవైపు రాజధాని నిర్మాణం విష‌యంలో మంత్రి నారాయ‌ణ‌పై బాబు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. రాజ‌ధాని నిర్మాణానికి అనేక సంస్థలు కొన్ని డిజైన్లు ఇచ్చినప్పటికీ, వాటిపై క్రీడా అధికారులు సక్రమంగా స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు. చివరకు ఆ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణపైనా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిర్మాణాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్న తరుణంలో ఇలా జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణ హడావుడిగా రాజధాని డిజైన్‌ పోస్టర్‌ను విడుదల చేయడం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/