Begin typing your search above and press return to search.

మోడిపై బాబు గెలిచి పోలవరం ను ఓడించారా ?

By:  Tupaki Desk   |   6 Jan 2018 7:17 AM GMT
మోడిపై బాబు గెలిచి పోలవరం ను ఓడించారా ?
X
పోలవరం ప్రాజెక్టులో తాత్కాలికంగా నిర్మించే కాఫర్ డ్యాం ఎత్తు విషయమై వివాదాస్పదంగా మారి దాదాపు మూడు నెలల పాటు పనులు నిలిచిపోవటానికి ఎవరు బాధ్యులు? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడా? లేక ప్రధానమంత్రి నరేంద్రమోదీనా? లేక ఇద్దరి మధ్య సమన్వయ లోపంతోనా? తాజాగా కాఫర్ డ్యాంను రాష్ట్ర ప్రభుత్వ డిజైన్ కు తగిన విధంగా నిర్మించేందుకు అనుమతించడం అంటే ప్రధాని మోడిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయం సాధించినట్లే భావించాలి. ముఖ్యమంత్రి సాధించిన విజయం రాష్ట్ర ప్రజలకు ప్రయోజనమా? నష్టమా? రాష్ట్ర ఇంజనీర్లకన్నా ఎన్ హెచ్ పీసీ నిపుణులు తెలివితక్కువవారా? అసలు ప్రాజెక్ట్ కన్నా కాఫర్ డ్యాంకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి? ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు అనువైన పరిస్థితులు కల్పించటానికి ఉపయోగపడే కాఫర్ డ్యాంను దాదాపు పోలవరం ప్రాజెక్టుగానే చిత్రీకరించి నీటిని ఆయకట్టుకు మళ్లించేందుకే ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందా? ముందు అంత ఎత్తు కాఫర్ డ్యాం అవసరం లేదని స్పష్టం చేసిన కేంద్ర సంస్థ ఎన్ హెచ్ పీసీ నిర్ణయాన్ని శుక్రవారం జరిగిన ప్రాజెక్టు డిజైన్ల కమిటీ తిరస్కరించినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. అంటే ఈ రెండు సంస్థల్లో ఏ సంస్థ తీసుకున్న నిర్ణయం సరైనది? జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఎన్ హెచ్ పీసీ వాదన రాష్ట్ర ప్రభుత్వ లాబీయింగ్ ముందు డీడీఆర్సీ సమావేశంలో వీగిపోయిందా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం దొరికే పరిస్థితి కనిపించటం లేదు. పోలవరం ప్రాజెక్టు అసలు నిర్మాణాన్ని నత్తనడకన సాగిస్తూ ఆ ప్రాజెక్టు నిర్మించేందుకు అనువైన పరిస్థితులు కల్పించటానికి తాత్కాలికంగా నిర్మించే కాఫర్ డ్యాం ఇంత వివాదమైతే అసలు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది?

ప్రాజెక్టు నిర్మాణంలో కాఫర్ డ్యాం భాగం కానేకాదు. ప్రాజెక్టు నిర్మాణానికి ఏమాత్రం సంబంధం లేదు. అయితే ప్రధాన జలాశయం నిర్మించే ప్రాంతంలో వర్క్ స్పేస్ ను కల్పించటంతో పాటు నది ప్రవాహం పనులకు అడ్డం కాకుండా ఉండేందుకే కాఫర్ డ్యాంను నిర్మిస్తారు. ఇది ప్రపంచంలో ఎక్కడ ప్రాజెక్టు చేపట్టినా దీనినే పాటిస్తారు. చైనాలో అతిపెద్ద ప్రీగార్జెస్ ప్రాజెక్టు నిర్మించినా రాష్ట్రంలో పోలవరం నిర్మిస్తున్నా అందులో భాగంగా ముందుగానే కాఫర్ డ్యాం నిర్మించటం అనివార్యం. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాఫర్ డ్యాంనే ప్రధాన జలాశయంగా భావిస్తుండటం.

2019లో శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఆలోగా పోలవరం పూర్తిచేయటం సాధ్యంకాదు. కాఫర్ డ్యాంను జలాశయం తరహాలో నిర్మించి దాని ద్వారా కుడి - ఎడమ కాలువలకు నీరివ్వాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశం. ఆయన బహిరంగంగానే ఈ విషయాన్ని ప్రకటించి 2018 నాటికి పోలవరం నుంచి నీరు ఇస్తామని గతంలో వెల్లడించారు. అందులో భాగంగా కాఫర్ డ్యాం ఎత్తును తొలుత డిజైన్ లో ప్రతిపాదించిన దానికన్నా అధికంగా అంటే 42.5 మీటర్లకు పెంచుతూ డిజైన్ను సిద్ధం చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వం మూడు నెలల క్రితం తిరస్కరించింది. నిజానికి కాఫర్ డ్యాం అనేది తాత్కాలికమైనది.

ప్రధాన జలాశయం పూర్తయిన తరువాత దీనిని తొలగిస్తారు. చైనాలోన ప్రీగార్జెస్ ప్రాజెక్టులోని కాఫర్ డ్యాం చాలా పెద్దది కావటంతో (ప్రీగార్జెస్ కూడా చాలా పెద్దది) జెలిటిన్ స్టిక్స్ సాయంతో పేల్చివేశారు. అందువల్ల కాఫర్ డ్యాం శాశ్వతమైనది కాదు - ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తప్ప ఆ తరువాత ఏవిధంగానూ ఉపయోగపడదు. అటువంటి కాఫర్ డ్యాంనే ప్రధాన జలాశయం అనేంతగా రాష్ట్ర ప్రభుత్వం వివాదం చేసింది. 2018లో కాఫర్ డ్యాం పూర్తయి 42.5 అడుగు మేరకు నీటిని తాత్కాలికంగా నిల్వ చేస్తే కుడి - ఎడమ కాలువకు మళ్లించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన.

వాస్తవానికి కాఫర్ డ్యాం భారీ వరదను, మరీ ముఖ్యంగా 20 లక్షల క్యూసెక్కులు ఆపైన 50 లక్షల వరకు వరద ప్రవాహం వస్తే తట్టుకోలేదు. దానిపైనుంచి నీరు ప్రవహిస్తుంది. ఆ క్రమంలో కాఫర్ డ్యాం దెబ్బతిని ప్రధాన జలాశయంలోని పనులకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంటుంది. అందువల్లనే కాఫర్ డ్యాం ఎత్తు పరిమితికి మించి ఉండకూడదనేది ప్రీగార్జెస్ చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నీటిని నిల్వ చేసి దాని ద్వారానే ప్రాజెక్టు పాక్షికంగా పూర్తి చేశామని నమ్మించే ప్రయత్నం కోసం ఎత్తు పెంచింది. దీనిని కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ఎన్ హెచ్ పీసీ తిరస్కరించింది.

ఎన్ హెచ్ పీసీ అనేది జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన సంస్థ. కేంద్ర ఆధీనంలోని లాభాల్లో ఉన్న సంస్థల్లో దీనిని మినీరత్న కేటాగిరి 1 కింద పరిగణిస్తుంటారు. అంటే విజయవంతమైన కేంద్ర సంస్థగా పరిగణించాలి. ఎన్ హెచ్ పీసీ దేశవ్యాప్తంగా జల విద్యుత్ - జలాశయాలు పర్యవేక్షణతో పాటు నిర్మాణంలోని జలాశయాల డిజైన్లను పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థను 1975లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో జల విద్యుత్ ప్రాజెక్ట్ ను (కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్మించేవాటిని) చేపడుతుంది. ఇప్పటి వరకు 6717 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 22 ప్రాజెక్టులను నిర్మించింది. పవన విద్యుత్ లోనూ 2016లో ప్రవేశించింది. ఇప్పుడు తాజాగా 4290 మెగా వాట్ల సామర్థ్యంతో 5 ప్రాజెక్టులు నిర్మిస్తోంది. 7151 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో 10 ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించింది.

పూర్తిగా సాంకేతికపరమైన ఈ సంస్థ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ విభాగం కన్నా ఉత్కృష్టమైనది. దాని సూచనలు విలువైనవి. ఈ విషయం రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులకు - ఇంజనీర్లకు కూడా తెలుసు. అయితే వారిపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది. అందువలనే ఎత్తు పెంచి ఎగువ కాఫర్ డ్యాం నిర్మించాలని పట్టుబట్టి సాధించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లాబీయింగ్ ముందు నిపుణత కలిగిన అనుభవం ఉన్న ఎన్ హెచ్ పీసీ సిఫార్సులు బుట్టదాఖలయ్యాయి. శుక్రవారం ప్రాజెక్టు డిజైన్ల కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా ఎత్తు పెంచి ఎగువ కాఫర్ డ్యాం నిర్మించాలని నిర్ణయించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇది నిజమైతే చంద్రబాబు పన్నిన వ్యూహాంలో ప్రాజెక్టు భాగమైపోగా - అందుకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం తలొగ్గినట్లు కనిపిస్తోంది.

ఈ ప్రాజెక్టులో మూడు నెలలపాటు కాఫర్ డ్యాం విషయం వివాదాస్పదంగా మారి - ప్రాజెక్టులోని అసలు అంశాలు ముఖ్యంగా మొత్తం వ్యయాన్ని తాము భరించేది లేదని కేంద్రం స్పష్టం చేయడం - నిర్మాణ సంస్థ ముఖ్యంగా ట్రాన్స్ ట్రాయ్ లాంటివి నత్తనడకన పనులు సాగించటం - ఫలితంగా రాష్ట్రానికి రైతాంగానికి నష్టం వాటిల్లుతుండడం - విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన చట్టబద్ధమైన హామీలను ఎగరగొట్టటం లాంటి అంశాలు కాఫర్ డ్యాం వల్ల మరుగున పడిపోయాయి. ఇదంతా చూస్తే కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను మోసగించేందుకు మూడు నెలలపాటు కాఫర్ డ్యాం వివాద నాటకాన్ని ఆడించినట్లు కనిపిస్తోంది. పోనీ ఎవరి వాదనలు వారు నిజాయితీగా సాగించారనుకుంటే ఈ మూడు నెలల సమయం వృథా కావటానికి బాధ్యులెవరు? ప్రధానంగా ప్రాజెక్టుకు ఇది వర్కింగ్ సీజన్. ఈ సమయంలోనే వరద ఉండదు కాబట్టి పనులు వేగంగా జరుగుతాయి. ఇప్పుడు జరిగిన ఆలస్యానికి బాధ్యులెవరు? కాఫర్ డ్యాం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదన నెగ్గటం నిజమైతే ఇది రాజకీయపరమైనదా? లేక సాంకేతికమైనదా? రాజకీయ పరమైనదైతే నిపుణత కలిగిన ఎన్ హెచ్ పీసీ రాష్ట్ర ఇంజనీర్ల ముందు తెల్లముఖం వేసిందా? అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన పలుకుబడితో కాఫర్ డ్యాం ఎత్తు పెంచి నిర్మించేందుకు అనుమతి సాధించి ఉంటే దానికి కేంద్రం తలూపి ఎన్ హెచ్ పీని డమ్మీ చేసిందా? ఇవన్నీ ఎవరి అవసరాల కోసం ఎందుకు జరిగాయి.

అసలు ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికి ఎందుకు వదిలేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరైనా చెప్పే పరిస్థితి ఉందా? అన్ని విషయాలు వెబ్ సైట్లో ఉంటాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ ప్రభుత్వం తరపున సమాచారం మాత్రమే అందులో ఉంటుంది కాని - ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. అనుమానాలను ఎవరూ నివృత్తి చేయరు. మొత్తానికి కాఫర్ డ్యాం వివాదం రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన విధంగా కొలిక్కి వచ్చివుంటే 2019 ఎన్నికల్లోపు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు దానిని పూర్తి చేసి అసలు ప్రాజెక్టుకు దాదాపుగా నీళ్లొదిలి రాష్ట్ర ప్రజల భవిష్యత్ బడ్జెట్ పై భారం భారీగా మోపనుండటం వాస్తవం కాదా? ఎన్ హెచ్ పీసీ అధికారులు దాదాపు మూడు నెలలపాటు సమయం వృథా చేసినందుకు వారిపై చర్యలు తీసుకునేదెవరు? ఇలా చెప్పుకుంటూ పోతే పోలవరం కథ ఇప్పట్లో పూర్తయ్యేలాగ కనిపించటం లేదు.

...వి ఎస్