Begin typing your search above and press return to search.

అవును నేనే సీనియర్‌ ని..మోదీకి బాబు లేఖ

By:  Tupaki Desk   |   11 Feb 2019 4:57 AM GMT
అవును నేనే సీనియర్‌ ని..మోదీకి బాబు లేఖ
X
గుంటూరు పర్యటనలో తనపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని నరేంద్రమోదీకి చంద్రబాబు ఘాటు లేఖ రాశారు. విభజన హామీలను నెరవేర్చని ప్రధాని ప్రజల దృష్టి మరల్చేందుకు తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. తనపై చేసిన విమర్శలకు ప్రతిగా ఐదు పేజీల లేఖ రాశారు.

''ప్యాకేజి గురించి ప్రసవ్తవించిన మీరు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు చెప్పలేకపోయారెందుకని..? హోదా ఇస్తే గుజరాత్‌ ని మించిపోతుందని భయంతోనే ఏపికి ఇవ్వలేదని చెప్పలేకపోయారా..?'' అని ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ చంద్రబాబు ఆ లేఖలో నిలదీశారు.

‘‘నా రాష్ట్రం మీద - నా కుటుంబం మీద చేసిన మీ వ్యాఖ్యలను దిష్టి చుక్కలు గానే నేను భావిస్తాను. కాకపోతే మీరే మరీ ఈ దేశానికే దిష్టిబొమ్మగా మారారే అనేదే నా బాధ’’ అంటూ ఆ లేఖలో ఎద్దేవా చేశారు.

లేఖలో ఏముందంటే...

మోదీ చెప్పినా - చెప్పకపోయినా నేనే సీనియర్‌ నని. ఆయన ఎగతాళి వ్యాఖ్యలే బీజేపీ పతనానికి బీజం వేస్తాయి. అమరావతికి ఎవరెంత చేశారో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అమరావతి కోసం రైతులు రూ.50 వేల కోట్ల విలువైన భూములను ఇవ్వడాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ. 1500 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కూడా సరిపోవన్నారు. మోదీ కళ్లముందే వచ్చే ఐదేళ్లలో దిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని సవాలు విసిరారు.

వైసీపీ స్క్రిప్ట్‌ ను మోదీ చదివినట్టు అందరూ అర్థం చేసుకున్నారని అన్నారు. దేశాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టిన ప్రధానిని భరించాల్సి వస్తోందనేదే తమ బాధని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన జగన్‌ ను ఒళ్లో కూర్చోబెట్టుకుని వెన్నుపోటు - ఫిరాయింపుల గురించి మోదీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని లేఖలో ధ్వజమెత్తారు. అద్వానీకి మీరు పొడిచిన పోటు గురించి ఆయన కన్నీళ్లే చెబుతున్నాయని అన్నారు. గతంలో మీరు నిందించిన కేసీఆరే మీకిప్పుడు పరిణతి చెందిన నాయకుడిగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన కుమారుడు లోకేశ్ గురించి మోదీ సర్టిఫికెట్ అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.