Begin typing your search above and press return to search.

ఫైరింజ‌న్లు పంట‌ల‌ను కాపాడుతాయా?

By:  Tupaki Desk   |   25 Aug 2016 9:14 AM GMT
ఫైరింజ‌న్లు పంట‌ల‌ను కాపాడుతాయా?
X
భార‌త దేశంలో ఫైర్ స‌ర్వీసులు - ఫైరింజ‌న్ల‌కు మ‌హా చెడ్డ పేరుంది. ఇళ్లు కాలిపోయి చల్లారిపోయిన త‌రువాతే ఫైరింజ‌న్లు అక్క‌డ‌కు చేరుతాయ‌ని అంటారు. అంత చెడ్డ‌పేరున్న ఫైరింజ‌న్ల‌ను ఇప్పుడు పంట‌ల‌ను కాపాడేందుకు ఉప‌యోగిస్తానని ఏపీ సీఎం చంద్ర‌బాబు చెబుతుండ‌డంతో విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఒక్క ఎకరం పొలం కూడా ఎండిపోకూడదని - అవసరమైన చోట ఫైరింజన్ల ద్వారా నీటిని సరఫరా చేసి పంటలను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 63 వేల ఎకరాలకు నీరు లేక రైతులు ఆందోళన చెందుతుంటే రెయిన్‌ గన్లను సమర్థంగా ఎందుకు వినియోగించుకోలేక పోతున్నారని అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు భూమికి సమీపంలో ఎక్కడ నీరుంటే అక్క‌డి నుంచి ఫైరింజన్లు సాయంతో తరలించి పంటలు కాపాడాల‌ని ఆదేశాలు జారీచేశారు.

అయితే, చంద్ర‌బాబు చెప్పింది విన‌డానికి బాగానే ఉన్నా ఆచ‌ర‌ణ‌లో అసాధ్య‌మ‌ని అంటున్నారు. మంట‌ల‌ను ఆర్ప‌డానికే టైముకి రాని ఫైరింజ‌న్లు పంట‌ల‌నేం కాపాడుతాయ‌న్న ప్ర‌శ్న వినిపిస్తోంది. అస‌లు రాష్ట్రంలో ఎన్ని ఫైర్ స్టేష‌న్లు ఉన్నాయి... ఎన్ని ఫైరింజ‌న్లు ఉన్నాయి.. ఎంత‌మంది సిబ్బంది ఉన్నారు.. ఎక్విప్ మెంటు క‌రెక్టుగా ఉందో లేదో చూసుకుని ఈ మాట‌లు చెప్పాలంటున్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గ‌ కేంద్రాల్లో కూడా ఫైర్ స్టేష‌న్లు లేవ‌ని అంటున్నారు.

నిజానికి ఈ విమ‌ర్శ‌లు నిజం కూడా.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్క ఫైర్ స్టేష‌న్ కూడా లేని నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. కేవ‌లం కృష్ణా -* క‌డ‌ప జిల్లాల్లో మాత్ర‌మే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఫైర్ స్టేష‌న్లున్నాయి. మిగ‌తా 11 జిల్లాల్లో ఫైర్ స్టేష‌న్లు లేని నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. ఈ 11 జిల్లాల్లో మొత్తం 36 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫైర్ స్టేష‌న్లు లేవు. గుంటూరు జిల్లాలో అత్య‌ధికంగా అయిదు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫైర్ స్టేష‌న్లు లేక‌పోగా తూర్పు - ప‌శ్చిమ‌గోదావ‌రి - చిత్తూరు - కర్నూలు జిల్లాల్లో నాలుగేసి నియోజ‌క‌వ‌ర్గాల్లో లేవు. అనంత‌పురం జిల్లాలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫైర్ స్టేష‌న్లు లేవు.

క‌ర‌వుతో అల్లాడుతున్న రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాల‌ను తీసుకుంటే క‌డ‌పలో మాత్ర‌మే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఫైర్ స్టేష‌న్లున్నాయి. చిత్తూరు - క‌ర్నూలు - అనంత‌పురం జిల్లాల్లో మొత్తం 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో లేవు. అంటే సుమారు 40కి పైగా రాయ‌ల‌సీమ మండ‌లాల‌కు ఫైరింజ‌న్లంటే ఏంటో తెలియ‌ని ప‌రిస్థితి. ప్ర‌కాశం - నెల్లూరు - విజ‌య‌న‌గ‌రంలోని క‌ర‌వు - మెట్ట ప్రాంతాల్లోనూ ఫైర్ స్టేష‌న్లు లేవు. అంతేకాదు ప్ర‌స్తుతం న‌వ్యాంధ్ర మొత్తంగా 220 వాట‌ర్ టెండ‌ర్లు - 12 వాట‌ర్ లారీలు మాత్ర‌మే ఫైర్ డిపార్టుమెంట్ వ‌ద్ద ఉన్నాయి. ఫోమ్ టెండ‌ర్లు - డ్రై కెమికల్ టెండ‌ర్లు వంటివి ఉన్నా అవి మంట‌ల‌ను ఆర్ప‌డానికే కానీ పంట‌ల‌ను కాపాడ‌డానికి ప‌నికిరావు. అలాంట‌ప్పుడు ఫైరింజ‌న్ల‌ను పంపించి పంట‌ల‌ను ఎలా బ‌తికిస్తారో చంద్ర‌బాబే చెప్పాలి.