Begin typing your search above and press return to search.

టీడీపీ కొత్త వ్యూహం!..ఇక అధికారులూ ప్ర‌చారానికేన‌ట‌!

By:  Tupaki Desk   |   14 March 2019 5:30 PM GMT
టీడీపీ కొత్త వ్యూహం!..ఇక అధికారులూ ప్ర‌చారానికేన‌ట‌!
X
అధికారంలో ఉన్న ఏ ప్ర‌భుత్వానికైనా ఉద్యోగులు ఒకింత సానుకూలంగానే ఉంటారు. ఎందుకంటే... వారి జీత భ‌త్యాలు - పీఆర్సీలు - ఇత‌ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఉద్యోగుల‌తో పాటు ఉద్యోగ సంఘాలు కూడా ఒకింత సానుకూలంగానే స్పందిస్తూ ఉంటాయి. అయితే ఆ సానుకూల‌త‌ను క్యాష్ చేసుకోవాల‌ని య‌త్నించ‌డం ఆయా పార్టీల‌కు అల‌వాటేన‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. అలా ఉద్యోగుల సానుకూల‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకునే క్ర‌మంలో ఆయా పార్టీలు వ్య‌వ‌హరించే తీరులోనే వ్య‌త్యాసాలు ఉంటాయి. చేసిన ప‌నుల‌ను స్వ‌చ్ఛందంగానే ఉద్యోగులు చెప్పేలా కొన్ని పార్టీలు వ్యూహం ర‌చిస్తుంటే... మ‌రికొన్ని పార్టీలు మాత్రం తాము ఏమీ చేయ‌కున్నా కూడా త‌మ‌కు అనుకూలంగా ప్ర‌జ‌ల‌ను త‌మ వైపున‌కు తిప్పేందుకు శ్ర‌మించాల్సింద‌న‌ని హుకుం జారీ చేస్తుంటాయి. సాధార‌ణంగా మంచి పనులు చేసే పార్టీల‌కు మ‌ద్ద‌తుగా నిలవ‌డంలోనే కాకుండా... ఫ‌లానా పార్టీల‌కు ఓటేస్తే మంచి జ‌రుగుతుంద‌ని కూడా త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు ఉద్యోగులు చెబుతుండ‌టం కొత్తేమీ కాదు.

అయితే అలా మంచి ప‌నులు చేయ‌కుండానే.. త‌మ‌ను ప్ర‌జ‌ల్లో మంచిగా చిత్రీక‌రించాల‌ని ఉద్యోగుల‌కు ఆదేశాలు జారీ చేసే పార్టీలు కూడా ఉంటాయి. ఇందుకోసం ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు ప‌ద‌వులూ ఇస్తుంటాయి. ఈ కోవ‌లోని పార్టీగానే ఏపీలోని అధికార పార్టీ కొత్త అవ‌తారం ఎత్త‌నుందన్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం మంచి ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి ఉంటే... వాటిని ఎవ‌రో చెబితేనో కాకుండా స్వ‌చ్ఛందంగానే ఉద్యోగులు వాటి గురించి ప్ర‌జ‌ల‌కు చెబుతారు. అయితే ఇప్పుడు ఏపీలో అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హారం న‌డుస్తున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే స‌మైక్యాంధ్ర ఉద్య‌మాన్ని నీరుగార్చ‌డంతో పాటుగా తాను ఏదంటే దానినే ఉద్యోగులంద‌రి మెద‌ళ్ల‌లోకి ఎక్కించేస్తున్న ఇటీవ‌లే ప‌ద‌వీ విమ‌ర‌ణ చేసిన ఏపీఎన్జీవో మాజీ అధ్య‌క్షుడు అశోక్ బాబుకు టీడీపీ ఏకంగా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చేసింది. అశోక్ బాబు ఏపీఎన్జీవో అధ్య‌క్షుడిగా ఉండ‌గా... టీడీపీ స‌ర్కారు ఏది చ‌య‌మంటే అదే చేశారు. చివ‌ర‌కు ఉద్యోగుల వేత‌నాల నుంచి బ‌ల‌వంతంగా విరాళాలు సేక‌రించిన‌ట్లుగానూ ఆయ‌న‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

స‌రే... ఇదంతా పాత గోలే అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తున్న గోల ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... రాష్ట్రంలోని ఉద్యోగులంతా కూడా టీడీపీకి అనుకూలంగా ప్ర‌చారం చేయాల్సిందేన‌ట‌. అందుకోసం ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను రంగంలోకి దించేసిన చంద్ర‌బాబు... ఏకంగా అమ‌రావ‌తిలోనే ప్ర‌త్యేకంగా శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌ను కూడా నిర్వ‌హించేందుకు రంగం సిద్ధం చేశార‌ట‌. ఇప్ప‌టికే తన హ‌యాంలో జ‌రిగిన అభివృద్దిని ప్ర‌జ‌ల‌కు చూపించండి అంటూ చంద్ర‌బాబు ఆదేశాలు జారీ చేయ‌గానే... అన్ని శాఖ‌లు ఒక్కుమ్మ‌డిగా రంగంలోకి దిగి... రాష్ట్రంలోని న‌లుమూల‌ల నుంచి ప్ర‌జ‌ల‌ను అటు అమ‌రావ‌తితో పాటు ఇటు పోల‌వ‌రం వ‌ద్ద‌కు త‌ర‌లించేశాయి. ఇందుకోసం ఆర్టీసీ పెద్ద సంఖ్య‌లో బ‌స్సుల‌ను ఏర్పాటు చేయ‌గా.. అందుకైన ఖ‌ర్చును ఏకంగా స‌ర్కారీ ఖ‌జానాల నుంచే చెల్లించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి క్ర‌మంలోనే ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌డం - ఒక్క‌రొక్క‌రుగా కీల‌క నేత‌లంతా పార్టీకి గుడ్ బై కొట్టేసి విపక్షంలోకి చేరిపోతుండ‌టంతో ఎన్నిక‌ల్లో గెలుపు క‌ష్ట‌మేన‌న్న ఓ అంచ‌నాకు వ‌చ్చిన చంద్ర‌బాబు... చివ‌రి అస్త్రంగా ఉద్యోగుల‌ను ప్ర‌చారానికి వాడుకునేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్టుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

త‌న మాట‌ను బాగానే పాటించే స‌చివాల‌య ఉద్యోగుల ద్వారా మంత్రాంగాన్ని న‌డిపేందుకు రంగం సిద్దం చేశార‌ట‌. ఇందులో భాగంగా త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే ప్ర‌జ‌లంద‌రికీ ఈ ద‌ఫా టీడీపీకే ఓటేయాల‌ని చెప్ప‌డంతో పాటు వారికి బ్రెయిన్ వాష్ చేసి పంపాల్సిన బాధ్య‌త ఉద్యోగుల‌దేన‌ట‌. ఈ త‌ర‌హా బ్రెయిన్ స్టార్మింగ్ ప్ర‌క్రియ‌ను ఎలా చేప‌ట్టాల‌న్న విష‌యంలోనూ ఉద్యోగుల‌కు ఇబ్బంది లేకుండా స్వ‌యంగా టీడీపీనే శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌ను ఏర్పాటు చేయ‌నుంద‌ట‌. అమ‌రావ‌తి కేంద్రంగానే ఇప్ప‌టికే ప్రారంభ‌మైపోయిన ఈ త‌ర‌గ‌తుల‌కు ఉద్యోగులంతా షిఫ్ట్ ల వారీగా హాజ‌రైన‌ట్లు కూడా తెలుస్తోంది. మొత్తంగా ఉద్యోగుల‌ను కూడా టీడీపీ త‌న‌కు మౌత్ పీస్‌లుగా వాడుకునేందుకు రంగం సిద్దం చేసింద‌న్న మాట‌. మ‌రి ఈ త‌ర‌హా వ్యూహం చంద్రబాబుకు ఏ మేర ప‌నికి వ‌స్తుందో చూడాలి.