Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ఉత్తరాంధ్రపై వివక్ష

By:  Tupaki Desk   |   19 Feb 2017 5:58 AM GMT
చంద్రబాబుకు ఉత్తరాంధ్రపై వివక్ష
X
ఉత్తరాది నాయకులకు - అక్కడి పార్టీలకు.. కేంద్రంలో అధికారం వెలగబెట్టే పార్టీలకు దక్షిణాది అంటే తీవ్ర వివక్ష ఉందని ఇటీవల కొద్దికాలంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ వివక్ష ఏ స్థాయిలో ఉందన్నది గణాంకాలు, ఘటనల సహితంగా వెల్లడిస్తున్నారు చాలామంది. అయితే.. దేశంలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ఇలా ఉంటే.. తెలుగు రాష్ట్రమైన ఏపీలో మరో రకమైన వివక్ష కొనసాగుతోంది. ఇక్కడి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతమైన మూడు జిల్లాలపై తీవ్ర వివక్ష చూపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వివక్ష ఈనాటిది కాదని... ఇప్పుడు మరింత ఎక్కువవుతోందని అంటున్నారు. తాజాగా మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

జర్మనీ ఆర్థిక సంస్థ సహకారంతో విజయవాడలో మెట్రోరైల్ ప్రాజెక్టు త్వరలోనే చేపట్టనున్నట్టు మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించడంతో విశాఖ - ఉత్తరాంధ్ర ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ విషయంలో చంద్రబాబు ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదని... ఇప్పుడు విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు విషయంలోనూ అన్యాయం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కేంద్రానికి సరైన రిపోర్టులు ఇవ్వడం లేదని.. విశాఖ విషయంలో నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మూడేళ్లుగా ఊరిస్తున్న విశాఖ మెట్రోరైల్‌ ను పక్కనపెట్టి, విజయవాడ మెట్రోరైల్‌ ను పట్టాలెక్కిస్తుండడం వెనుక చంద్రబాబు గేమ్ ప్లాన్ ఉందని ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర విభజనకు ఏడాది ముందు విశాఖ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోరైల్ నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను ప్రభుత్వాలు మారడంతో ప్రాధాన్యతలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో విశాఖ స్థానే విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలు వేగవంతం అవుతున్నాయి. విశాఖలో మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి విదితమే. తొలుత రూ.6000 కోట్లతో 20 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ ప్రాజెక్టు చేపట్టాలని భావించారు. ఈలోగా రాష్ట్ర విభజన జరగడం, గుంటూరు - విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు నిర్ణయం చకచకా జరిగిపోయాయి. దీంతో రాజధాని అవసరాలంటూ చంద్రబాబు విజయవాడ మెట్రోకే ఫస్టు ప్రయారిటీ ఇస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంతో కేంద్రం అంగీకారం తెలిపింది.

నిజానికి విశాఖ మెట్రో కోసం ఇప్పటికే చాలా అడుగులు పడ్డాయి. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాధమిక సర్వే సహా డిపిఆర్ రూపొందించే బాధ్యతను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌ సి)కి ప్రభుత్వం అప్పగించింది. తొలుత అనుకున్నట్టు విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టును 20 కిమీ నుంచి 43 కిమీకి పొడిగించారు. మూడు కారిడార్లుగా దీన్ని ఏర్పాటు చేయాలని, అందుకు రూ.13,500 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి అంచనా వ్యయంలో 20 శాతం కేంద్ర ప్రభుత్వం - మరో 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, మిగిలిన మొత్తాన్ని విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం అప్పట్లో జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ (జెఐసిఎ) విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. జర్మనీ - ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఆర్థిక సంస్థలు మెట్రోరైల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. కానీ.. ఇప్పుడు విజయవాడ మెట్రోను ముందుకు తోయడంపై ఉత్తరాంధ్రులు మండిపడుతున్నారు.

అసలు రాజధాని ఏర్పాటు సమయంలోనే చంద్రబాబు నిర్ణయాలను వ్యతిరేకించి ఉంటే ఈ రోజు ఇంత వివక్ష ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది. దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా... ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత రెండో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖను కాదని చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారు. మూడేళ్లలో అమరావతిలో చేసిందేమీ లేదు. అదే విశాఖలో అయితే.. అన్ని వసతులూ ఉన్నందున ఇప్పటికే ఎంతో ప్రగతి సాధ్యమయ్యేది. కానీ.. ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారు.

ఆ తరువాత కూడా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు విశాఖకు ఇస్తామని ప్రకటించినా అందులో కొన్ని మాత్రమే ఇచ్చి మిగతావి సెంట్రల్ ఆంధ్రకు తరలించుకుపోయారు. విశాఖ రైల్వే జోన్ పైనా చంద్రబాబు శ్రద్ధ పెట్టడం లేదు. ఇవన్నీ చూస్తున్నవారు చంద్రబాబుకు ఉత్తరాంధ్ర అంటే వివక్ష ఉందని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/