Begin typing your search above and press return to search.

లేటెందుకు బాబు...కానివ్వండి

By:  Tupaki Desk   |   30 May 2016 6:07 AM GMT
లేటెందుకు బాబు...కానివ్వండి
X
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. మ‌హానాడు ముగిసిన అనంత‌రం తిరుప‌తిలోనే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపినా ఎంపికపై స్పష్టత రాలేదు. మంగళవారమే తుది గడువు అయిన నేప‌థ్యంలో ఈ అంశంపై చంద్రబాబు సోమవారం ఏ స‌మయానికైనా నిర్ణ‌యం తీసుకుంటార‌ని భావిస్తున్నారు.

రాజ్య‌స‌భ స‌భ్యుల ఎంపిక నిర్ణయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకే పొలిట్ బ్యూరో అప్పగించింది. ఈ నేప‌థ్యంలో విజయవాడలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదిలాఉండగా రాజ్యసభకు ఏపీ కోటా నుంచి మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నిక జరగనుండగా, టీడీపీ తన మిత్రపక్షమైన బీజేపీతో కలిసి మూడు స్థానాలను సునాయసంగా గెలుచుకోనుంది. ఇందులో ఒక స్థానాన్ని ఇప్ప‌టికే బీజేపీకి కేటాయించింది. బీజేపీ తమ అభ్యర్థిగా కేంద్ర‌మంత్రి సురేష్ ప్రభును ప్రకటించింది. కేంద్ర‌మంత్రి సుజనా చౌదరిని తిరిగి రాజ్యసభకు పంపించే విషయంలో భిన్నాభిప్రాయాలు వెలువడడంతో, ఆయన ఎంపిక ఇంకా కరారు కాలేదు. మరోవైపు ఎస్‌ సీ - బీసీల నుంచి తప్పని సరిగా అభ్యర్థులను ఎంపిక చేయాలన్న విజ్ఞప్తులు - ఒత్తిళ్ళు ఉన్నాయి. దీంతో ఆయన బీసీ నుంచి బీటీ నాయుడును రాజ్యసభ సీటుకు పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్‌ సి అయితే మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్‌ ను లేదా మహిళా కోటా నుంచి హేమలతను పోటీ చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మ‌రోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల బలం కూడా తోడుగా ఉండడంతో నాలుగో సీటుకూ పోటీ చేసే అంశంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక - నాలుగో స్థానంపై పోటీ చేసే అంశాలపై చంద్రబాబు ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయేంత వరకూ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో - పార్టీ ముఖ్యులతో మంతనాలు జరిపారు. అభ్య‌ర్థుల ఖ‌రారు స‌మ‌యంలోనూ ఈ చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది.