Begin typing your search above and press return to search.

ఏపీలో ఇప్పుట్లో గుడ్ న్యూస్ ఉండ‌ద‌ట‌

By:  Tupaki Desk   |   29 April 2017 4:46 PM GMT
ఏపీలో ఇప్పుట్లో గుడ్ న్యూస్ ఉండ‌ద‌ట‌
X
ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లు ఎదురుచూస్తున్న అంశం ఏదైనా ఉందంటే... అది పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లే. ఐదు చోట్ల ఉన్న పెండింగ్ ఎన్నిక‌ల‌ను పూర్తి చేసేందుకు సర్వం సిద్ధ‌మ‌యింద‌ని అప్పుడే వార్త‌లు రావ‌డం...ఆ వెంట‌నే ఇప్ప‌ట్లో ఉండ‌బోవు అనే తేలిపోవ‌డం అనేది గ‌త మూడేళ్లుగా జ‌రుగుతూ వ‌స్తోంది. ఈ ఎపిసోడ్‌లో తాజాగా వ‌చ్చిన స్ప‌ష్టత ఏమిటంటే..ఈ ఎన్నిక‌లు ఇప్పుడే ఉండ‌వని. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాశంగా ఉన్న‌ ఒకేద‌ఫా ఎన్నికలను సాకుగా చూపించి మరో రెండేళ్లపాటు ప్రత్యేక అధికారుల పాలననే కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పట్లో మునిసిపల్‌ ఎన్నికలు జరగవంటూ ప్రభుత్వ వైఖరిని ఆ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.

ఏపీలోని కొన్ని పురపాలక సంఘాలను నగరపాలక సంస్థలుగా మారుస్తూ హోదా పెంచడం, మరికొన్ని చోట్ల ఆయా నగర పాలక సంస్థల శివారు ప్రాంతాల్లో ఉన్న గ్రామ పంచాయతీలను విలీనం చేయడం తదితర కారణాలతో 2014లో ఆయా సంస్థలకు ఎన్నికల వాయిదా పడ్డాయి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నగర పాలక సంస్థలు, ఒక పురపాలక సంఘం, మరో మూడు నగర పంచాయతీలు ఎన్నికలకు నోచుకోలేదు. ఎన్నికలు జరగక, ప్రజాప్రతినిధుల వ్యవస్థ ఏర్పడ చాలా కాలంగా ఇక్కడ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. తిరుపతి పురపాలక సంఘాన్ని నగర పాలక సంస్థగా హోదా పెంచుతూ 2007లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుపతి శివారు ప్రాంతాల్లోని పలు గ్రామాలను నగర పాలక సంస్థలో విలీనం చేయడంతో కొందరు వ్యతిరేకించారు. వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో చిక్కులు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి తిరుపతిలో ప్రత్యేక అధికారులదే పాలన. గుంటూరు నగర పాలక సంస్థలోనూ ప్రత్యేక అధికారుల పాలన 2009 నుంచి కొనసాగుతోంది. గుంటూరు నగర పాలక సంస్థలో కొత్తగా సమీపంలోని 15 గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉన్న న్యాయ వివాదాల చిక్కులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సమస్య తొలగింది.

ఒంగోలు పురపాలక సంఘం హోదాను పెంచి నగర పాలక సంస్థగా మారుస్తూ 2013 సంవత్సరాల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలు సమీపంలో ఉన్న ఐదు గ్రామాలను నగర పాలక సంస్థలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మూడు గ్రామాలనుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కాకినాడ నగర పాలక సంస్థలో 2010 నుంచి ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. విలీన గ్రామాలకు సంబంధిం చిన న్యాయ వివాదాలను సాకుగా చూపిస్తూ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై కాలయాపన చేస్తూ వస్తుంది. శ్రీ‌కాకుళంలో పురపాలక సంఘాన్ని నగర పాలక సంస్థగా మార్చారు. కర్నూలు నగర పాలక సంస్థలోనూ, విశాఖపట్నం నగర పాలక సంస్థలోనూ , ప్రకాశం జిల్లా కందుకూరు పురపాలక సంఘంలోనూ ప్రతేక అధికారులదే పాలన. కొత్తగా ఏర్పడిన రాజాం పురపాలక సంఘం, నెల్లిమర్లను నగర పంచాయతీ వ్యవహారంలోనూ వివాదాలు ముసురుకున్నాయి.ఇలా వివాదాల విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చి ఎన్నిక‌లు జ‌రుగుతుంద‌ని భావిస్తుండ‌గా తాజాగా ముఖ్య‌మంత్రి స‌హా సంబంధిత శాఖా మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఎంతోకాలంగా ప్రజా ప్రతినిధుల వ్యవస్థ లేక, ప్రత్యేక అధికారుల పాలనలో కాలం గడుపుతున్న పలు నగర పాలక సంస్థలకు మరో సారి నిరాశే ఎదురైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/