Begin typing your search above and press return to search.

క్యాబినెట్ మీటింగ్ లో బాబు పొగడ్తలు.. తిట్లు?

By:  Tupaki Desk   |   3 May 2016 6:24 AM GMT
క్యాబినెట్ మీటింగ్ లో బాబు పొగడ్తలు.. తిట్లు?
X
ఏపీ మంత్రివర్గ సమావేశం సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగున్నర గంటల పాటు దీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. కొన్ని అంశాల మీద చర్చ జరిగిన సందర్భంలో కొందరు మంత్రులకు మెచ్చుకోళ్లు.. మరికొందరు మంత్రులకు చివాట్లు పడ్డాయని చెబుతున్నారు. శాఖల వారీగా రివ్యూ జరిగినప్పుడు కొందరి పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన బాబు.. కొందరి పని తీరు బాగుందని ప్రశంసించినట్లుగా చెబుతున్నారు. ఇలా ప్రశంసలు పొందిన వారిలో కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. కార్మిక శాఖ పని తీరు బాగుందని ఆయనకు బాబు కితాబు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

అదే సమయంలోకొందరు మంత్రులపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందరిక కంటే ఎక్కువ తిట్లు తిన్నది మంత్రి పీతల సుజాతగా చెబుతున్నారు. ఆమె పరిధిలోని ఇసుక విషయంలో జరుగుతున్న లోటుపాట్లు.. అధికారుల తీరుకు మంత్రిని బాధ్యులుగా చేసినట్లు తెలుస్తోంది. రాత్రివేళలో ఇసుక తవ్వకూడదంటూ పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల విషయం బాబు సీరియస్ కావటమే కాదు.. ఇసుక తవ్వుకునే విషయంలో అధికారుల జోక్యం ఏమిటని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. ప్రజలకు తక్కువ ధరకు ఇసుక అందాలన్న ఉద్దేశంతో ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేస్తుంటే.. అధికారులు ఇలాంటి ఆంక్షలు పెడితే ఎలా? అని నిలదీసిన ఆయన.. గనుల శాఖామంత్రి పీతల సుజాతను గట్టిగా క్లాస్ పీకినట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం ధరల్ని ఎమ్మార్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్రపై ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది. శాఖలో జరుగుతున్న వ్యవహారాల్ని పట్టించుకోకపోతే ఎలా అని నిలదీసిన చంద్రబాబు.. తాను అడిగిన ప్రశ్నలకు రవీంద్ర నుంచి సంతృప్తికర సమాధానాలు రాకపోవటంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఏమైనా.. గత క్యాబినెట్ సమావేశాలకు కాస్త భిన్నంగా.. ఈసారి సమావేశం జరిగినట్లుగా చెబుతున్నారు.