Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరికి కూర్చోబెట్టి మరీ క్లాస్ పీకిన బాబు?

By:  Tupaki Desk   |   3 May 2016 6:21 AM GMT
ఆ ఇద్దరికి కూర్చోబెట్టి మరీ క్లాస్ పీకిన బాబు?
X
ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఏపీలో విపక్షం అన్నది లేకుండా చేయాలన్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అన్నది తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ను కానీ భారీగా దెబ్బ తీస్తే.. వచ్చే ఎన్నికల నాటికి సరైన నేత జగన్ పక్షాన ఉండకుండా చేయాలని.. అదే కానీ చేస్తే.. 2019 ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవటం చాలా ఈజీ అన్న ఆలోచనలో బాబు అండ్ కో ఉన్న విషయం తెలిసిందే. తన దీర్ఘకాలిక ప్రణాళిక సరిగా వర్క్ వుట్ కావాలంటే ఆపరేషన్ ఆకర్ష్ ను పూర్తిస్థాయిలో చేపట్టాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగా భిన్న ధ్రువాలకు చెందిన నేతల్ని సైతం కలిపే పనిని చంద్రబాబు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా వర్గపోరులో నలిగే భిన్నధ్రువాలకు చెందిన నేతల్ని ఒకే సైకిల్ మీద ప్రయాణించేలా ఆయన ప్లాన్ చేశారు. ఇది ప్రమాదకరమైన ప్రయత్నయంగా పలువురు చెబుతున్నా.. దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగితే.. ఏపీలో తాను తిరుగులేని అధినేతగా మారే అవకాశం ఉందన్న విషయాన్ని బాబు బలంగా నమ్ముతున్నారు.

ఇందులో భాగంగానే వివిధ జిల్లాలకు చెందిన వైరి వర్గీయుల్ని పార్టీలో చేర్చుకోవటం తెలిసిందే. కర్నూలు జిల్లాలో శిల్పా సోదరులకు ఏ మాత్రం పొసగని భూమా నాగిరెడ్డిని పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. భూమా రాకతో.. కర్నూలు జిల్లా టీడీపీలో వర్గ పోరు చోటు చేసుకోవటం తెలిసిందే. అంతర్గత విభేదాలతో శిల్పా.. భూమా వర్గీయుల మధ్య నడుస్తున్న రచ్చ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తోంది. దీనికి చెక్ చెప్పేందుకు తాజాగా భూమానాగిరెడ్డి.. శిల్పా బ్రదర్స్ ను తన నివాసానికి పిలపించుకున్నారు చంద్రబాబు.

వారిని ఒకచోట కూర్చోబెట్టి.. ఇద్దరికి గట్టిగా క్లాస్ పీకినట్లుగా చెబుతున్నారు. ఇద్దరూ కొట్టుకుంటే పార్టీకి నష్టం వాటిల్లటం ఖాయమని.. ఇద్దరూ విభేదాలు లేకుండా నడవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాల్ని ప్రోత్సహిస్తే మాత్రం తాను తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్న హెచ్చరికను చేసినట్లుగా చెబుతున్నారు. పార్టీలోకి నేతల ఎంట్రీ పార్టీకి బలం కావాలే తప్పించి బలహీనం కాకూడదని.. ఆ విషయంలో భూమా.. శిల్పా వర్గీయులు జాగ్రత్తగా ఉండాలని బాబు చెప్పినట్లుగా చెబుతున్నారు.

ఈ మాటలో నిజం ఎంతన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేకున్నా.. చంద్రబాబు క్లాస్ పీకిన తర్వాత శిల్పా బ్రదర్స్ మీడియాతో మాట్లాడిన సమయంలో భూమాతో తమకు మనస్పర్థలు లేవన్నట్లుగా మాట్లాడటం గమనార్హం. పార్టీని బలోపేతం చేయటమే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ఒక అడుగు ముందుకేసిన శిల్పా బ్రదర్స్.. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావటం ఖాయమని తేల్చేశారు. చంద్రబాబు మాట వేదవాక్కు అన్న ఈ బ్రదర్స్.. భూమాతో కలిసిపోతామని స్పష్టం చేయటం గమనార్హం. రెండు వర్గాలు మనస్ఫూర్తిగా కలిసి పోవాలంటూ బాబు ఇచ్చిన పిలుపునకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చూస్తుంటే శిల్పా బ్రదర్స్ మీద బాబు క్లాస్ ప్రభావం బాగున్నట్లు అనిపిస్తుంది కదూ..?