Begin typing your search above and press return to search.

టెక్ చంద్రుడి హైటెక్ ప్రాజెక్ట్

By:  Tupaki Desk   |   10 Oct 2015 7:32 AM GMT
టెక్ చంద్రుడి హైటెక్ ప్రాజెక్ట్
X
2017 సెప్టెంబరు 17 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన ఎలక్ట్రానిక్ పాలనగా మారిపోనుంది. 33 శాఖల ద్వారా 774 ప్రభుత్వ సేవలను అందించే ఇ-ప్రగతి ప్రాజెక్టుకు రూ.2398 కోట్లతో 2017 సెప్టెంబరు నాటికి పూర్తి చేయబోతున్నారు. దేశంలోనే ఎలక్ర్టానిక్ గవర్నెన్సు దిశగా అడుగులేస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోంది. ఇప్పటికే ఎన్నో సేవలను ఆన్ లైన్ చేసిన ఏపీ గవర్నమెంటు మొత్తం పాలనను పేపర్ లెస్ గా మార్చేందుకు రెడీ అవుతోంది.

డిజిటల్‌ భారతదేశం అన్న ప్రధాని నరేంద్ర మోడీ భావనకు ఎపి నుంచే ప్రేరణ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందులోభాగంగానే విశాఖలో ఇ-ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. 33 శాఖల ద్వారా 774 ప్రభుత్వ సేవలను అందించే ఇ-ప్రగతి ప్రాజెక్టుకు రూ.2398 కోట్లు రాష్ట్రంలో ఖర్చుచేయబోతున్నారు.

ఇ-ప్రగతి ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తికానుంది. పౌరులకు అవసరమైన అన్ని పనులూ ఆన్‌ లైన్‌ చేస్తారు. రెండేళ్ల తర్వాత ఎపి పూర్తిగా కమర్షియల్‌ ప్రాజెక్టుగా మారుతుందని, ఇతర రాష్ట్రాలకు అవసరమైన సరుకులు ఇక్కడ నుంచే అందరూ కొనుక్కోవడం ఖాయమని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అన్ని స్థాయిల్లోనూ ఇన్ ఫర్మేషన్‌ టెక్నాలజీ దరఖాస్తులను ఆహ్వానించడం, అమలు చేయడమే ఇ-ప్రగతి ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో ఇ-ప్రగతి ప్రాజెక్టు అమలుకోసం తక్షణం రూ.175 కోట్లు రివాల్వింగ్‌ ఫండ్‌ ఉంచుతామన్నారు. దీంట్లో సింగపూర్‌ ప్రభుత్వ సాయం ద్వారా రూ.25 కోట్లు వివిధ పనులకు తక్షణం ఇస్తున్నామని చెప్పారు. ఇ-ప్రగతి ప్రాజెక్టు ద్వారా ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు క్యాంపెయిన్ల కార్యక్రమాలను సమర్థవంతంగా రాష్ట్రంలో అమలు చేయనున్నామన్నారు. అభివృద్ధిపనులకు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు సమస్యలను సృష్టిస్తున్నాయని, భూసేకరణకు అడ్డుగా నిలవడమేగాకుండా పార్లమెంట్‌ లో భూసేకరణ బిల్లును అడ్డుకున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు.

సాంకేతిక రంగంలో మంచి పట్టున్న చంద్రబాబు గత పాలనలోనూ ఐటీరంగానికి పెద్ద పీట వేశారు. గతసారి ఐటీతో ఉద్యోగాలు, సంపద సృష్టించిన ఆయన ఈసారి వాటితో పాటు పౌరులకు సులభ సేవలు అందించే కార్యక్రమానికి మార్గం వేస్తున్నారు.