Begin typing your search above and press return to search.

బాబుకు మరోసారి కరెంటు షాక్ తప్పదా?

By:  Tupaki Desk   |   19 Jan 2017 4:56 AM GMT
బాబుకు మరోసారి కరెంటు షాక్ తప్పదా?
X
చరిత్రను మర్చిపోకూడదు. పాత అనుభవాల్ని అస్సలు వదిలేయకూడదు. ఒకసారి చేసిన తప్పును మరోసారి చేయకుండా ఉండటం చాలా అవసరం. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. విభజన కారణంగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారటం.. ప్రభుత్వం పెట్టే ఖర్చును నియంత్రించటంలో బాబు ఫెయిల్ కావటంతో.. లోటును ఎంతోకొంత కవర్ చేసుకోవటానికి విద్యుత్ ఛార్జీల పెంపు లాంటివి చేయక తప్పని పరిస్థితి.

అయితే.. గతంలో కరెంటు ఛార్జీల పెంపు నిర్ణయంతో ఎదురైన చేదు అనుభవాన్ని బాబు మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. తొమ్మిదిన్నరేళ్ల తన పాలనలో విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయానికి ముందు వరకూ చంద్రబాబుకు తిరుగులేదన్నట్లుగా పరిస్థితి ఉండేది. విద్యుత్ ఛార్జీల పెంపు.. విద్యుత్ బిల్లుల్ని కట్టలేని రైతన్నల విషయంలో నాటి బాబు సర్కారు అనుసరించిన విధానాలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచటమే కాదు.. బాబు ప్రభుత్వం పదేళ్లు అధికారంలోకి రాకుండా చేయటానికి కారణమన్న విషయాన్ని మర్చిపోకూడదు.

నాడు విద్యుత్ ఛార్జీల పెంపుపై బాబు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ చేసిన దీక్ష ఏపీని ఎంతలా కదిలించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ దీక్ష.. కమ్యూనిస్టుల ఆందోళన.. వెరసి బషీర్ బాగ్ దారుణ ఉదంతం బాబు ప్రభుత్వాన్ని పడేసేలా చేశాయన్నది పచ్చి నిజం. ఇన్ని జరిగిన తర్వాత కూడా.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక కూడా కరెంటు ఛార్జీల పెంపుపై బాబు సర్కారు దృష్టి పెట్టటం గమనార్హం.

గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా కరెంటు ఛార్జీల పెంపు విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో ఇప్పటికే రెండుసార్లు విద్యుత్ ఛార్జీల్ని పెంచుతూ నిర్ణయాన్ని తీసుకుంది బాబు సర్కారు. 2015 – 16లో రూ.940 కోట్ల భారాన్ని మోపిన బాబు సర్కారు 2016-17 లలో రూ.240 కోట్ల భారాన్ని ప్రజలపై వేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ పెంపును అర్థం చేసుకున్న ప్రజలు తమపై అదనపు భారమైనా సరేననే పరిస్థితి.

అయితే.. ఈసారి ప్రజలపై మరింత భారాన్ని మోపేలా బాబు ప్రభుత్వం సిద్ధం కావటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యక్ష.. పరోక్ష పద్ధతులతో విద్యుత్ ఛార్జీల్ని భారీగా పెంచాలని భావిస్తోంది. తాజా పెంపుతో రూ.3359 కోట్ల భారాన్ని ప్రజలపై మోపేలా ప్రభుత్వం ప్లాన్ చేయటం గమనార్హం. తాజా ఛార్జీల పెంపు ప్రతిపాదన పుణ్యమా అని.. 67 శాతంగా ఉన్న గృహ వినియోగదారులపై ఫిక్సెడ్ చార్జీలు వేయటం ద్వారా.. వారి బిల్లులు భారీగా పెరిగే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గృహ వినియోగదారులపై ఒక్కశాతం ఫిక్సెడ్.. డిమాండ్ ఛార్జీల పెంపు ద్వారా రూ.859కోట్ల ఆదాయాన్ని.. వాణిజ్య వినియోగదారుల నుంచి రూ.96 కోట్లు.. రైసు మిల్లులు.. చిన్నతరహా పరిశ్రమలు.. థియేటర్లు ఇలా పలు వర్గాలపైనా విద్యుత్ బిల్లుల భారాన్ని పెంచేలా ప్రతిపాదనను సిద్ధం చేసుకున్నారు. తాజాగా తీసుకుంటున్న నిర్ణయాల్ని చూస్తే.. విద్యుత్ ఛార్జిల పెంపు నిర్ణయం తమకు ఏ మాత్రం కలిసి రాలేదన్న చేదు నిజాన్ని బాబుమర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ప్రజలపై వీలైనంత తక్కువ భారాన్ని మోపి.. పాలనా రథాన్ని సమర్థంగా నడిపించే నాయకుడ్ని ఇప్పటి ప్రజలు కోరుకుంటున్నారన్న విషయం బాబు గుర్తిస్తే బాగుంటుంది. లేకుంటే.. తిప్పలు తప్పవని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/