Begin typing your search above and press return to search.

అక్టోబ‌ర్ నెల‌లో బాబుకు ఆ ఒక్క‌టే ప‌ని

By:  Tupaki Desk   |   24 Sep 2016 5:30 PM GMT
అక్టోబ‌ర్ నెల‌లో బాబుకు ఆ ఒక్క‌టే ప‌ని
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు కొత్త స‌మ‌స్య ఎదురుకానుందా? రాబోయే అక్టోబ‌ర్ నెల‌లో ఆయ‌న తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి ఖాయ‌మా? ఇటు ఓటుకు నోటు - మ‌రోవైపు రాజ‌ధాని అమ‌రావ‌తికి నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ తీర్పు - అదే స‌మ‌యంలో నిర్మాణం కోసం ఉద్దేశించిన స్విస్ చాలెంజ్ విధానంపై రానున్న ఫ‌లితం ఇందుకు కార‌ణ‌మా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది. అక్టోబ‌ర్‌ నెల మొత్తం కోర్టు వాదన‌ల‌కు సిద్ధం అవ‌డం - తీర్పుల‌ను అధ్య‌య‌నం చేయ‌డమే సీఎం చంద్ర‌బాబు ముందున్న క‌ర్త‌వ్యంగా మారిపోతుంద‌ని తెలుగుదేశం వ‌ర్గాల్లోనే అంత‌ర్గ‌తంగా సాగుతుండ‌టం గ‌మ‌నార్హం.

తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసులో దర్యాప్తును నిలిపివేస్తూ హై కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వు లను సుప్రీంకోర్టు కొట్టేసిన సంగ‌తి తెలిసిందే. అవినీతి కేసులను విచారిస్తున్నపుడు హైకోర్టు విచారణకు ఏ విధంగా స్టే ఇస్తుందని సుప్రీంకోర్టు ఈ సంద‌ర్భంగా ప్రశ్నించటం గమనార్హం. ఓటుకు నోటు కేసులో విచారణను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించ‌డ‌మే కాకుండా ఒక వేళ నాలుగు వారాల్లో హైకోర్టు గనుక ఈ కేసులో తగిన నిర్ణయం తీసుకోకపోతే పిటీషనర్ తిరిగి సుప్రింకోర్టును ఆశ్రయించ‌వచ్చని కూడా చెప్పటం గమనార్హం. స‌ర్వోన్న‌త న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. ఇంకోవైపు ఎటువంటి అనుమతులు లేకుండా వేలాది ఎకరాల పచ్చని పంట పొలాలను రాజధాని పేరుతో ధ్వసం చేయటానికి వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ లో విచారణ జరుగుతోంది. దీనిపైనా అక్టోబ‌రులో తీర్పు వ‌చ్చే అవకాశం ఉంది. ఇంతేకాకుండా రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపైన న‌వంబ‌రులో మొద‌టి వారంలో తీర్పు రానుంది. ఇలా న్యాయస్ధానాల్లో విచారణలో ఉన్న కేసులన్నీ కీలకమైనవే కావటంతో ఇటు చంద్రబాబు అటు పార్టీ నేత‌లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఎదురుదెబ్బ తగలటం, అందుకు తోడుగా ఈ రెండు కేసులు జ‌త‌కావ‌డంతో ఇటు ప్రభుత్వం అటు టీడీపీ ఒకేసారి తీవ్ర ఒత్తిడిలో పడిపోయాయి. కొంత కాలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా న్యాయస్ధానాలు క్రియాశీలకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కాక టీడీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ఒక్కసారిగా కోర్టు కేసులు వేగవంతం అవ్వటంతో ఇటు ముఖ్యమంత్రిగాను అటు పార్టీ అధ్యక్షునిగాను చంద్రబాబుకు ఇబ్బందులు మొదలవుతున్నాయని అంటున్నారు. వ‌చ్చే నెల‌లో త‌మ‌నాయ‌కుడు కోర్టు వాద‌న‌ల‌కు సిద్ధ‌మ‌వ‌డం, తీర్పుల‌పై అధ్య‌య‌నం చేయ‌డానికే స‌మ‌యం స‌రిపోతుంద‌ని చెప్తున్నారు.