Begin typing your search above and press return to search.

టీడీపీ.. 'ఆపరేషన్ ఆ ఆరుగురట’'..

By:  Tupaki Desk   |   22 Feb 2019 6:11 AM GMT
టీడీపీ.. ఆపరేషన్ ఆ ఆరుగురట’..
X
ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడానికి స్కెచ్ గీస్తోంది. అదే సమయంలో అసెంబ్లీలో.. బయటా.. తమను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న ప్రతిపక్ష వైసీపీ నేతలను తాజాగా టార్గెట్ చేశారట టీడీపీ అధినేత - సీఎం చంద్రబాబు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ ఎలా అయితే కాంగ్రెస్ సీనియర్లకు చెక్ పెట్టారో అదే వ్యూహాన్ని వైసీపీ కీలక నేతలను ఓడించేందుకు బాబు రంగం సిద్ధం చేశారని టీడీపీ శిబిరంలో చర్చ నడుస్తోంది. బాబు ఆ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేల ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం.

తెలంగాణ ఎన్నికల వేళ.. కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ - అల్లుడు హరీష్ రావు - కూతురు కవితలను రంగంలోకి దించి కాంగ్రెస్ సీనియర్లు అయిన జానారెడ్డి - కోమటిరెడ్డి - రేవంత్ రెడ్డి - డీకే అరుణ - చిన్నారెడ్డి - దామోదర రాజనర్సింహా - జీవన్ రెడ్డి నియోజకవర్గాల్లో పాగా వేయించి వారిని ఓడించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు స్కెచ్ గీసినా ఆయన చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా ‘ట్రక్కు’ గుర్తు వల్ల బతికిబట్టకట్టారు. ఈ కాంగ్రెస్ సీనియర్లంతా టీఆర్ ఎస్ ను - కేసీఆర్ ను టార్గెట్ చేసినవారే.. దీంతో కేసీఆర్ వేసిన ఫార్ములాను టీడీపీ అధినేత వచ్చే ఎన్నికల్లో అమలు చేయబోతున్నారట.. టీడీపీని ఇరుకునపెడుతున్న ఆ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలను ఓడించేందుకు బలమైన అభ్యర్థులను - వివిధ ప్రత్యామ్మాయాలను సిద్ధం చేస్తున్నారట..

టీడీపీలో ఇప్పటికే ఆపరేషన్ ఆ ఆరుగురు మొదలైందన్న చర్చ సాగుతోంది. ఆ ఆరుగురు వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఎవరంటే.. ఒకరు నగరి ఎమ్మెల్యే రోజా.. రెండు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి - మూడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని - నాలుగు డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేందర్ రెడ్డి - అయిదు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ - ఆరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ ఆరుగురిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని.. ఈ ఆరుగురు మళ్లీ వచ్చే అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూడాలన్నది బాబు వేసిన ‘‘ఆపరేషన్ ఆ ఆరుగురు’’ లక్ష్యమట..

టీడీపీ ప్రత్యేకంగా టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు బయట మాత్రమే కాదు.. అసెంబ్లీలో కూడా అధికార టీడీపీతో ఢీ అంటే ఢీ అంటూ వచ్చారట.. కేవలం దూకుడుతో టీడీపీని బెంబేలెత్తించిన వారు కొందరైతే.. సబ్జెక్ట్ పరంగా అసెంబ్లీలో టీడీపీని చెడుగుడు ఆడినవారు మరికొందరు. మొత్తంగా తమను తీవ్రంగా ఇరుకున పెట్టిన ఈ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలను వచ్చే అసెంబ్లీలో ఎంటర్ కాకుండా చూడాలని.. ఒక్కరు కూడా మిస్ కాకుండా ఆరుగురిని ఓడించాలన్న స్కెచ్ ను బాబు గీశాడట..

అయితే ఈ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేల ఓటమి అంతా ఈజీ కాదు.. వీరంతా ఇంటా బయటా మాస్ లీడర్లే.. ప్రజలకు చేరువవుతూ సొంతంగా ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. వీరిపై ఎంత బలమైన టీడీపీ అభ్యర్థులు నిలబడినా వీరి ఫాలోయింగ్ ను తట్టుకోవడం కష్టమే.. మరి బాబు వేసిన ఈ ప్లాన్ ఏపీ ఎన్నికల్లోగా వర్కవుట్ అవుతుందా.? లేదా తిరగబడుతుందా వేచిచూడాలి.