Begin typing your search above and press return to search.

పార్టీ బ‌లోపేతం కోసం బాబు షార్ట్‌ క‌ట్‌

By:  Tupaki Desk   |   29 July 2016 11:30 AM GMT
పార్టీ బ‌లోపేతం కోసం బాబు షార్ట్‌ క‌ట్‌
X
తెలుగుదేశం పార్టీ బ‌లోపేతం కోసం ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం కొత్త రూట్ కనుక్కొన్నార‌ని అంటున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్ ద్వారా ఇప్పటివరకు ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల‌కు పసుపు కండువా కప్పిన బాబు ఇపుడు కొత్తగా స్థానిక సంస్థ‌ల‌పై క‌న్నేశార‌ని తాజా పరిణామాల ఆధారంగా ఆ పార్టీ నేత‌లు విశ్లేషిస్తున్నారు. నగర పాలక - పురపాలక - గ్రామ పంచాయతీల్లోనూ ప్రజాప్రతినిధులందరూ తమ వాళ్లే ఉండేలా టీడీపీ అధిష్టానం తమ ప్రభుత్వం ద్వారా 'పంచాయతీరాజ్‌ యాక్ట్‌ 2007 - చాప్టర్‌ 28'లో సవరణ తీసుకురానుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్తున్నారు. త‌ద్వారా 'ఎనభై శాతం మనోళ్లే ఉండాలి.. 2050 వరకూ మనమే అధికారంలో ఉండాలి.. జనం వద్దకు వెళ్లండి..' అని మహానాడులో చంద్రబాబు ఇచ్చిన పిలుపును అమలు చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలతో మొదలుపెట్టిన చంద్రబాబు 'ఆపరేషన్‌ ఆకర్ష్‌' పథకం స్థానిక సంస్థల్లోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకువ‌చ్చిన జీవోకే మార్పులు చేసేందుకు రంగం సిద్ధ‌మవుతోంది. స్థానిక సంస్థ‌ల్లో తరచూ అవిశ్వాస తీర్మానాలు పెట్టడం వల్ల పరిపాలనకు ఆటంకంగా మారుతోందని, రాజకీయ జోక్యం ఎక్కువవుతోందని 'అవిశ్వాస' కాలపరిమితిని నాలుగేళ్లకు పొడిగిస్తూ వైఎస్‌ జీవో తెచ్చారు. అయితే ఈ జీవోను చంద్రబాబు నాయుడు తమకు అనుకూలంగా మరల్చుకునే ప్రయత్నాలను ప్రారంభించారని అంటున్నారు. రెండేళ్ల పాలన పూర్తి కావడంతో స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్తున్నారు. ముందుగా ఈ స‌వ‌ర‌ణ ద్వారా త‌న సొంత జిల్లా అయిన చిత్తూరులో ఆప‌రేష‌న్ రూపొందించేలా బాబు స్కెచ్ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

పంచాయతీరాజ్‌ యాక్ట్‌ 2007 - చాప్టర్ 28 సవరణ అమల్లోకి వస్తే ఒక్క చిత్తూరు జిల్లాలోనే నగరి - పలమనేరు మున్సిపాలిటీలు టీడీపీకి దక్కనున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న అమరనాథరెడ్డి ఇటీవ‌లే టీడీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. అదే స‌మ‌యంలో 50 శాతానికి పైగా కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం వైసిపికి చెందిన శారదా కుమార్‌ ఛైర్మన్‌ గా ఉన్నారు. మ‌రోవైపు వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నగరి మున్సిపాలిటీలో ఒకే ఒక్క సీటు తేడాతో టీడీపీ ఛైర్మన్‌ పదవిని పోగొట్టుకుంది. నగరి ఎమ్మెల్యే హోదాలో రోజా తన ఓటును వేయడంతో ఛైర్మన్‌ పదవిని వైసీపీ దక్కించుకుంది. రెండేళ్ల అవిశ్వాసం తెరపైకి వస్తే ఈ రెండు మున్సిపాలిటీలూ టిడిపి వశం కానున్నాయి. జిల్లాలో ఒక్క పుంగనూరు తప్ప మిగిలిన ఏడు మున్సిపాలిటీలూ టిడిపి పరం కానున్నాయి. అలాగే పుంగనూరు - మదనపల్లి - జీడీ నెల్లూరు - పూతలపట్టు నియోజకవర్గాల్లో ఎక్కువ ఎంపిపి స్థానాలను వైసిపి దక్కించుకుంది. అక్కడా ఆకర్ష్‌ పథకం ఉపయోగించి, అవిశ్వాసం ప్రయోగించి టిడిపి వశం చేసుకోనుంది. ఈ విధంగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెండేళ్ల కాలానికే తగ్గించడం వల్ల మెజారిటీ స్థానిక సంస్థలను తమ వైపు మళ్లించుకోవచ్చని వ్యూహం సాగుతోంది. మొత్తంగా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ aలో బాబు కొత్త త‌ర‌హా విధానానికి శ్రీ‌కారం చుట్టార‌ని అంటున్నారు.