Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌కు బాబు బాగానే ఊపు ఇచ్చారు

By:  Tupaki Desk   |   27 May 2017 4:57 PM GMT
త‌మ్ముళ్ల‌కు బాబు బాగానే ఊపు ఇచ్చారు
X
తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మ‌హానాడులో పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ త‌మ్ముళ్ల‌లో ఊపునిచ్చార‌ని చ‌ర్చ సాగుతోంది. ఒకింత క్లాస్ తీసుకుంటూ మరోవైపు రాజ‌కీయ ల‌క్ష్యాల‌ను వివ‌రిస్తూ...పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రసంగం చేశారు. నాయకుడు దూరదృష్టితో వ్యవహరించాలని సీఎం చంద్రబాబునాయుడు కార్యకర్తలకు హితవు పలికారు. 2022 నాటికి దేశంలోనే మొదటి 3 రాష్ట్రాల్లో ఏపీ ఉండాలని అన్నారు. 2029 నాటికి దేశంలోనే మొదటి రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఏపీ ఉండాలని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తల సాధికారతకు ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. టీడీపీ నేతలంతా సోషల్‌ మీడియాను పాజిటివ్‌ గా ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు - ఎంపీలంతా ఫేస్‌ బుక్‌ ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా ఖాతాలను తెరిచి వినియోగించాలని తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా 36 ఏళ్లుగా టీడీపీ అలుపెరుగని పోరాటం చేస్తోందని, పదవుల కన్నా దేశ - రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తులపై క్రమశిక్షణతో వ్యవహరించాలని తెలిపారు. పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, ఎవరికివారు మాట్లాడకూదని తేల్చిచెప్పారు. ఎవరో విమర్శించారు కదా అని ఎవరుపడితే వారు మాట్లాడకూడవద్దన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడినవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, మహానాడులో తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ అస్తవ్యస్థ పాలనపై సండ్ర వెంకట వీరయ్య తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ అసమర్థ పాలన నడుస్తోందని, ప్రజాస్వామ్యం గొంతు నొక్కే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని, రైతులకు వ్యతిరేకంగా టీఆర్‌ ఎస్‌ పాలన నడుస్తోందని సండ్ర అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలనపై సండ్ర ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీఎం చంద్రబాబునాయుడు సమర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం టీడీపీ ఎల్లప్పుడూ పనిచేస్తోందని, తెలంగాణ టీడీపీ పోరాటాలకు పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని తెలిపారు.

కాగా, మహానాడులో విద్యుత్‌ విజయాలపై కళా వెంకట్రావ్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. దేశంలోనే విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తెచ్చిన వ్యక్తి చంద్రబాబే అని పేర్కొన్నారు. విద్యుత్‌ సంస్కరణలతో నాణ్యమైన విద్యుత్‌ సరఫర ఆచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రెండో దశ సంస్కరణలకు చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారన్నారు. మహానాడులో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌-విజన్‌ 2022పై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీర్మానం ప్రవేశపెట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/