Begin typing your search above and press return to search.

మ‌హానాడులో బాబు ఎందుక‌లా చేశారు?

By:  Tupaki Desk   |   28 May 2016 8:18 AM GMT
మ‌హానాడులో బాబు ఎందుక‌లా చేశారు?
X
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భ‌వించిన త‌ర్వాత‌, న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రుగుతున్న మొదటి మ‌హానాడులో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు అధ్యక్షోపన్యాసంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బాబు ప్రసంగం రొటీన్‌గా సాగి పార్టీ శ్రేణులను ఉత్సాహ పరచలేకపోయిందని ప్రాంగణంలో చర్చించుకోవడం కనిపించింది. ప్రత్యేక హోదా కోసం, ప్యాకేజీలపై కేంద్ర ప్ర‌భుత్వంపై గట్టిగానే స్పందిస్తారని ఊహించ‌గా సుతిమెత్తగా 'కేంద్రం సానుకూలంగా ఉంది ప్రత్యేక హోదా సాధించుకుందాం' అని చంద్ర‌బాబు చెప్ప‌డం పార్టీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

చంద్రబాబు తన ప్రసంగంలో ప‌దేళ్ల‌ క్రితం సాగిన దివంగ‌త‌ వైఎస్ ప‌రిపాల‌న గురించి మాట్లాడుతూ ఆయ‌న కుటుంబం నేరపూరిత రాజకీయాలు చేస్తోందంటూ ఫైర‌య్యారు. అయితే అదే స‌మ‌యంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నోరు మెదపకపోవడం గమనార్హం. కేంద్రంపైనా - కేసీఆర్‌ పైనా చంద్రబాబు ఉపన్యాస తీరు 'కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం' అన్న చందంగా సాగింది.అయితే తెలంగాణాలో పార్టీ అణచివేతపై కేసీఆర్‌ అనుసరిస్తున్న తీరుపై ఆ రాష్ట్ర కార్యకర్తలు యుద్ధం ప్రకటించారు. తెలంగాణా ప్రతినిధులంతా కేసీఆర్‌ పై ప్రసంగించినపుడు ఈలలు వేస్తూ స్పందించడం ఆస‌క్తిక‌రం. అమ‌రావ‌తి విష‌యానికి వ‌స్తే.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షాలు రాజకీయాలు చేయకుండా కలసి రావాలని బాబు కోరారు. ప్రత్యేక హోదా - రాయలసీమ-ఉత్తరాంధ్ర ప్యాకేజీల విషయంలో 'అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి అయ్యేవరకూ కేంద్రం అండగా ఉండాలి' అని ఒక్క మాటతో తేల్చేశారు.

ఇదిలాఉండ‌గా ఓవైపు ఉక్కపోత.. మరోవైపు అరకొర ఏర్పాట్లతో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఎండవేడిమి అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసింది. ఫ్యాన్లు - అరకొరగా పెట్టిన కూలర్లు మహానాడుకు వచ్చిన వారికి ఏమాత్రం ఉపశమనాన్ని కలిగించలేకపోయాయి. అందరూ చేతికి దొరికిన కరపత్రాలు - పుస్తకాలతో విసురుకోవడం కనిపించింది. మరుగుదొడ్లు చాలక - ఉన్నవాటిల్లోనూ నీరు చాలక ఇబ్బందులు పడ్డారు. సరైన భోజన వసతి కూడా లేకపోవడంతో పార్టీ నాయకులపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు

చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగానే సభావేదికపై ఉన్న నాయకులు నిద్రలో మునిగిపోయారు. ఎమ్మెల్యే, సినీన‌టుడు నందమూరి బాలక్రిష్ణ ముందు వరుసలో కూర్చునే గాఢ నిద్రలో మునిగిపోవ‌డం అందరి దృష్టినీ ఆయనపైనే నిలిపేటట్లు చేసింది. ఉప ముఖ్యమంత్రులు కెఇ క్రిష్ణమూర్తి - నిమ్మకాయల చిన్నరాజప్ప - మంత్రి అయన్నపాత్రుడు - టీటీడీ ఛైర్మెన్‌ చదలవాడ కృష్ణమూర్తి సైతం కునుకు తీశారు.