Begin typing your search above and press return to search.

ఏపీలో సగం సిట్టింగ్‌ లు అవుట్

By:  Tupaki Desk   |   22 Sep 2018 7:30 AM GMT
ఏపీలో సగం సిట్టింగ్‌ లు అవుట్
X
ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలు ఉంది. ఇప్పుడే ఎన్నికలేమిటా అనుకుంటున్నారా. అవును నిజమే. తెలంగాణలో ముందస్తుతో ముందుకు వెళ్లినా ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంత అనుకూలంగా లేకపోవడమే అంటున్నారు. పచ్చ మీడియా చేసిన సర్వేతో పాటు చంద్రబాబు నాయుడు సొంతంగా చేయించుకున్న సర్వే - ఇంటిలిజెన్పీ నివేదికలు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే వస్తున్నాయంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శాసనసభ్యుల పనితీరుపై ఓ సర్వే చేయించారని సమాచారం. ఈ సర్వేలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 80 శాతం మందిపై ప్రజల్లో తీవ్ర అసంత్రప్తి ఉందని వెల్లడైనట్లు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ పరిస్ధితి నానాటికీ దిగజారుతోందని ఇంటెలిజెన్సీ నివేదికలు చెబుతున్నాయి. పార్టీలో కొత్తగా చేరిన వారితో సీనియర్ నాయకులకు పొసగడం లేదని సమాచారం. ఇది విషయాన్ని ఇంటిలిజెన్సీతో పాటు చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేలో కూడా వెల్లడైనట్లు చెబుతున్నారు. దీంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సగం మందిని మార్చాలని చంద్రబాబునాయుడికి పార్టీ సీనియర్లు సూచించినట్లు చెబుతున్నారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ కూడా ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారే కావడంతో ఈ మూడు జిల్లాల్లోనూ సిట్టింగులను పూర్తిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఉభయ గోదావరి - కృష్ణా - గుంటూరు - నెల్లూరు - ప్రకాశం జిల్లాల్లో అయితే మొత్తం సిట్టింగులందరినీ మార్చాలనే ప్రతిపాదనలు వచ్చాయని సమాచారం. ఈ జిల్లాకు చెందిన మంత్రులపై కూడా ప్రజల్లో తీవ్ర అసంత్రప్తి ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయినట్లు సమాచారం. మంత్రులు కూడా నిర్లక్ష్యంగా వవహరించడం పట్ల ఏమిటని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రితో అన్నట్లు చెబుతున్నారు. అలాగే విజయవాడకు చెందిన ఓ ఎమ్మెల్యే - పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేపై కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారని సమాచారం. ఇక రాయలసీమ జిల్లాల్లో పార్టీ పరవాలేదు అనుకుంటున్న సమయంలో తనయుడు - ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యటనతో సీన్ మొత్తం మారిపోయిందని అంటున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఎదురు తిరుగుతున్నట్లుగా చేస్తున్న ప్రకటనలు - అనంతపురం జిల్లాలో ఎంపి జె.సీ.దివాకర్ రెడ్డికి - జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు కూడా పార్టీని రోడ్డున పడేస్తున్నాయని చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ సారి ఎన్నికల్లో సగానికి సగం మందికి టిక్కట్లు ఇవ్వరాదని - కొత్త వారితో ఎన్నికల బరిలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు చంద్రబాబు నాయుడి సన్నిహితులు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు తొమ్మిది నెలల ఉండడంతో ఈ మార్పులు అనివార్యంగానే కనిపిస్తున్నాయి.