Begin typing your search above and press return to search.

త‌న పాల‌న‌పై బాబు ర‌హ‌స్య స‌ర్వే

By:  Tupaki Desk   |   15 Jan 2018 4:44 AM GMT
త‌న పాల‌న‌పై బాబు ర‌హ‌స్య స‌ర్వే
X
ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత మ‌రోమారు స‌ర్వే మంత్రం జ‌పిస్తున్నారా? ఈ ద‌ఫా ఎప్ప‌ట్లాగే పార్టీ ప‌ర‌మైన‌ది కాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ల అనంతరం ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందా లేక వ్యతిరేకత ఉందా? అనే అంశాల‌పై ఈ స‌ర్వే చేస్తున్నారా? ఇందుకు ప్ర‌భుత్వవ‌ర్గాల‌నే వాడుకుంటున్నారా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది. వివిధ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం సుమారు 25 అంశాలతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వం రహస్య సర్వే నిర్వహిస్తోంది. సర్వే కోసం ప్రభుత్వ నిఘా వర్గాలు - ఇంటెలిజెన్సీ అధికారులు - స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బందితోపాటు చెన్న్తెకు చెందిన ఓ ప్రయివేట్‌ సంస్థతో ప్రభుత్వం సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. మూడేళ్లపాలనపై సర్కారు అంతర్మథనంలో పడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రజాప్రతినిధుల పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, 2019 ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు, ఆయా నియోజకవర్గాల్లో టికెట్‌లను ఎవరికి ఇస్తే బాగుంటుదని సర్వే చేస్తున్నట్లు సమచారం. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టిన తరువాత ప్రజల్లో ఆ పార్టీ పట్ల ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాపు రిజర్వేషన్ల అంశం అసెంబ్లీలో ప్రవేశపెట్టి మమ అనిపించిన విషయంపైన ప్రజల్లో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయా అనే అంశాలను సర్వేలో పొందుపరిచినట్లు తెలిసింది. త్వరలో డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇవ్వడం ద్వారా నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకుండా నివారించే అవకాశాలపై యువత అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సర్వే నిర్వాహకులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం.

దీంతోపాటుగా ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న వర్గాలకు ఎటువంటి పథకాలు ప్రవేశపెడితే ఆయా వర్గాల నుంచి ఓటు బ్యాంక్‌ రాబట్టుకోవచ్చనే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.సర్వేలో ప్రభుత్వ బలాలు - బలహీనతలు - కాపు కార్పొరేషన్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ల వల్ల ఆయా వర్గాలు సంతృప్తిగా ఉన్నారా? లేక అసంతృప్తిగా ఉన్నారా? ఆయా వర్గాలకు ఈ ఏడాదిలో ఎటువంటి సంక్షేమ ఫలాలు ప్రవేశపెడితే టీడీపీకి కలిసి వస్తాయనే అంశాలపై ఆయా వర్గాల అభిప్రాయాలను రహస్య వర్గాలు సేకరించే పనిలో నిమగమయ్యారు. టీడీపీకి ఓటేసిన వారు ఎన్నికల ముందు ఏమి ఆశించారు? రాజధాని ఎంపిక - నిర్మాణాలు తదితర విషయాలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనే అంశాలు సర్వేలో కీలకంగా ఉన్నట్లు సమాచారం.