Begin typing your search above and press return to search.

బాబు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   28 Sep 2016 4:36 AM GMT
బాబు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా?
X
రెండు క‌ళ్ల సిద్ధాంతం..ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఆయా ప్రాంతానికి త‌గిన‌ట్లుగా మాట్లాడి త‌ద్వారా ప‌ర‌స్ప‌ర విభిన్న ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంతో బాబు ఈ అప‌ప్ర‌ద ఎదుర్కున్నారు. ఇపుడు అదే ప‌రిస్థితి జంపింగ్ ఎమ్మెల్యేల విష‌యంలో ఎదుర‌వుతోంద‌ని చెప్తున్నారు. ఏపీలో మంత్రివర్గ పునర్ వ్య‌వస్థీకరణపై ఒకవైపు ఊహాగానాలు సాగుతున్న సమయంలోనే, వైసీపీ నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇటీవల బాబు గవర్నర్‌ ను కలసిన సందర్భంలో మంత్రివర్గ విస్తరణపై చర్చకు వచ్చినప్పుడు, వైసీపీ ఎమ్మెల్యేలను కొందరిని తీసుకోవాలని భావిస్తున్నానని బాబు తన మనసులో మాట చెప్పారు. అయితే, సనత్‌ నగర్ నుంచి తెదేపా ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే తెరాసలో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్‌ ను మంత్రిగా ఎలా ప్రమాణం చేయించారని తనపై తెలంగాణ తెదేపా నేతలు విమర్శలు కురిపించిన విషయాన్ని గవర్నర్ నరసింహన్ గుర్తు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలో కొత్త వివాదం నెత్తినేసుకోవడం ఎందుకన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఒకవైపు తలసాని శ్రీనివాసయాదవ్‌ తో రాజీనామా చేయించకుండా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నందుకు విమర్శిస్తూ - మరోవైపు తాము కూడా అదే సంప్రదాయం కొనసాగిస్తే ప్రజలు - ప్రతిపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని పలువురు సీనియర్లు ఇటీవల బాబు వద్ద అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక విధానం, ఏపీలో ఒక విధానం అనుసరిస్తోందని టీడీపీ - వైసీపీ విమర్శలు కురిపిస్తున్నందున...పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వకపోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘రాజకీయంగా క్లిష్ట సమస్యల్లో ఉన్నాం. దానికి అదనంగా ఈ సమస్యలు చేరితే, వాటిని ఎదుర్కొనేందుకు మరికొంత సమయం కేటాయించాలి. ఇప్పుడు అంత అవసరమా? ఫిరాయింపుదారులకు చోటిచ్చి అప్రతిష్ఠ తెచ్చుకోవలసిన పనిలేదు. తలసానిని విమర్శించి మనమూ ఆ పనిచేస్తే ఇక వాళ్లకు మనకూ తేడా ఏముంటుంది’ అని పార్టీకి చెందిన నేతలు పేర్కొంటున్నారు. అయితే, ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకున్న ఫిరాయింపుదారులకు కీలకమైన కార్పొరేషన్లు ఇస్తే సరిపోతుందన్న చర్చ కూడా జరుగుతోంది. అందులో భాగంగా ఒకరిద్దరికి కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇవ్వవచ్చంటున్నారు. దాంతో నమ్ముకుని వచ్చిన వారికి న్యాయం చేశారన్న సంకేతాలయినా వెళతాయంటున్నారు. ఎలాగూ తాము పదవులు ఆశించి రాలేదని, బాబు చేస్తున్న అభివృద్ధిని చూసి బేషరతుగానే పార్టీలో చేరామని 20 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే ప్రకటించారు. కాబట్టి తమను మోసం చేశారని విమర్శించే అవకాశం కూడా ఉండదని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇదిలాఉండ‌గా ...తాజా పరిణామాలు మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్న వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగిస్తున్నాయి. బాబు గవర్నరును కలిసినప్పటి నుంచి ఈ ప్రచారం జరుగుతున్నా - దానిని పట్టించుకోని ఆ ఎమ్మెల్యేలు - ఇప్పుడు ఆ చర్చ పైస్థాయిలో కూడా మొదలయి - బాబు ఒక నిర్ణయం తీసుకున్నారని చర్చ వారిని నిరాశకు గురిచేస్తోంది. పార్టీ మారిన భూమా నాగిరెడ్డి లేదా ఆయన కుమార్తె అఖిలప్రియలో ఒకరికి - జలీల్‌ ఖాన్ - చాంద్‌ పాషాలో ఒకరికి - సుజయకృష్ణరంగారావు - జ్యోతుల నెహ్రుకు మంత్రి పదవి లభిస్తుందన్న చర్చ చాలాకాలం నుంచి పార్టీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులిచ్చే అంశంపై సాంకేతిక - న్యాయ సమస్యలను గ్రహించిన బాబు పునరాలోచనలో పడినట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/