Begin typing your search above and press return to search.

కేంద్రంపై బాబు దిమ్మ‌తిరిగే ప్లాన్

By:  Tupaki Desk   |   2 May 2016 4:46 PM GMT
కేంద్రంపై బాబు దిమ్మ‌తిరిగే ప్లాన్
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి కేంద్ర ప్ర‌భుత్వం - బీజేపీ ఎన్నో విధాలుగా స‌హాయం చేస్తోంద‌టూ క‌మ‌ళ‌నాథులు - ఢిల్లీ పెద్దలు చేస్తున్న ప్ర‌చారానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కౌంట‌ర్ సిద్ధం చేస్తున్నారా? తాజాగా కేంద్ర‌మంత్రి హ‌రీభాయ్ చౌద‌రి చేసిన వ్యాఖ్య‌లు - ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు తెలుగుదేశం పార్టీని త‌మ‌దైన ర‌క్ష‌ణ సిద్ధం చేసేందుకు కార‌ణంగా మారాయా? ఈ ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదా - వెనకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పూర్తి వ్యయాన్ని తామే భరిస్తామని - రెవెన్యూ లోటును కూడా భర్తీ చేసి ఆదుకుంటామని విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలని చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు - కేంద్రం ఇచ్చిన నిధులపై అంశాలవారీగా ఒక శ్వేతప్రతం విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ప్రారంభించారని స‌మాచారం. పార్టీలో సీనియర్ల‌తో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు.

కొత్త రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్ల నిధులు ఇచ్చామని, పోలవరానికి రూ. 7100 కోట్ల నిధులు సమకూర్చి 2018 నాటికి ఒక దశ పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటామని, పది జాతీయ విద్యా సంస్ధలను ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి రాజ్యసభలో ప్రకటించగా, తమకు ఇంతవరకు రూ. 850 కోట్లు మాత్రమే అందిందని రాష్ట్రప్రభుత్వం అంటోంది. పోలవరం ప్రాజెక్టుకు రూ. 4000 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గత ఫిబ్రవరిలోనే కేంద్రానికి వినతిపత్రం సమర్పించారు. కాని బడ్జెట్‌ లో రూ.100 కోట్లు కేటాయించారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయగా, నాబార్డు నుంచి నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పినా, ఇంతవరకు ఫలితం శూన్యం. ఇటీవల కేంద్రం ఆదేశంపై పోలవరం అథారిటీ అధికారులు ప్రాజెక్టును సందర్శించి నిర్మాణాలను అంచనావేసి నివేదికను కేంద్రానికి అందించారు.రాష్ట్రంలో ఉత్తరాంధ్రలోని 3, రాయలసీమలోని 4 వెనకబడిన జిల్లాలకు ఒకసారి మాత్రమే రూ.50 కోట్ల చొప్పున రూ.350 కోట్ల చొప్పున రెండేళ్లుగా రూ. 700 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. విభజన సందర్భంగా రెవెన్యూలోటు రూ. 16,000 కోట్లు ఉంది. ఏపికి కేంద్రం రూ.13,500 కోట్లను రెవెన్యూ లోటు భర్తీకి చెల్లించాలని కాగ్ సిఫార్సు చేసింది. ఈ నివేదికను కూడా కేంద్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో వాస్త‌వాలు వెల్ల‌డించేందుకు శ్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేయాల‌ని టీడీపీలో చ‌ర్చ సాగుతున్న‌ట్లుగా పార్టీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఈ శ్వేత‌ప‌త్రం ఆధారంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసుల‌కు కేంద్రం ఏం చెప్పింది, ఏం చేసింది అనే అంశంతో పాటు రాష్ట్రం కోరింది, రాష్ట్ర ప‌రిస్థితి అవ‌గాహ‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుగుదేశం వ‌ర్గాలు భావిస్తున్నాయి.