Begin typing your search above and press return to search.

ఏపీ రాజ‌ధాని నిర్మాణాల‌కి జ‌క్క‌న్న ప్లాన్‌.. !

By:  Tupaki Desk   |   14 Sep 2017 11:39 AM GMT
ఏపీ రాజ‌ధాని నిర్మాణాల‌కి జ‌క్క‌న్న ప్లాన్‌.. !
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో న‌వ న‌గ‌రాల నిర్మాణం అదిరిపోయేలా నిర్మించాల‌ని భావిస్తున్న సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఈ డిజైన్ల‌కు సంబంధించి కోట్ల‌కు కోట్లు ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేశారు. క‌న్స‌ల్టెంట్ల పేరిట‌ - విదేశీ ప‌ర్య‌ట‌న‌ల పేరిట నిధుల‌ను విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేశారు. అయినా వారు ఇచ్చిన ఏ ఒక్క డిజైన్ కూడా బాబుకు న‌చ్చ‌లేదు. అంతేకాదు, ప్ర‌తి డిజైన్ పైనా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజాగా నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఇచ్చిన తుది డిజైన్లను కూడా ఖరారు చేయలేదు. దీనిపై వచ్చే నెల 25న తర్వాత లండన్‌ వెళ్లి మరోసారి సంప్రదింపులు జరపాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే, ఇంత‌లోనే బాబు బుర్ర‌కు మ‌రో ఆలోచ‌న వ‌చ్చింది.

బాహుబ‌లి ద్వారా ప్ర‌పంచ స్థాయి గుర్తింపు పొందిన ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజమౌళిని సంప్రదించి రాజ‌ధాని నిర్మాణాల డిజైన్‌ పై చ‌ర్చిస్తే బాగుంటుంద‌ని సీఎం ఆలోచిస్తున్నారు. గ‌తంలోనూ బాబు ఈ ప్ర‌తిపాద‌న‌ను తెచ్చినా అప్ప‌ట్లో బాహుబ‌లి మూవీ మేకింగ్ బిజీలో ఉండ‌డంతో రాజమౌళి సున్నితంగా తిరస్కరించారు. అయితే, ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉండ‌డంతో రాజమౌళి వద్దకు వెళ్లాలని బాబు ప్ర‌తిపాదిస్తున్నారు. జ‌క్క‌న్న‌కు రాజ‌ధాని ప్రాముఖ్యాన్ని వివ‌రించి.. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి రిచ్‌గా అదిరిపోయేలా ఈ డిజైన్ల‌ను రూపొందించాల‌ని బాబు భావిస్తున్న‌ట్టు తెలిసింది.

నిజానికి 2018 - జూన్‌ నాటికి రాజధానిలో మొదటి దశ నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రమాణ స్వీకార సమయంలో చంద్రబాబు చెప్పారు. మూడున్నరేళ్లు గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. డిజైన్ల ఖరారు దగ్గరే వ్యవహారం సాగుతోంది. గతంలో జపాన్‌ కు చెందిన మాకీ సంస్థ నుంచి డిజైన్లు తీసుకుని, తర్వాత పక్కన పెట్టారు. ఇప్పుడు నార్మ‌న్ పోస్ట‌ర్ సంస్థ ఇచ్చిన డిజైన్ల‌పైనా పెద‌వి విరుస్తున్నారు. దీంతో పొరుగింటి పుల్ల‌కూర క‌న్నా.. సొంతింటి కూరే బెట‌ర్ అన్న‌ట్టుగా మ‌నోళ్ల‌నే దీనిలో ఇన్వాల్వ్ చేయాల‌ని బాబు యోచిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే జ‌క్క‌న్న‌కు క‌బురు పెట్టాల‌ని ప్రిపేర్ అవుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రి రాజ‌మౌళి మూడ్ ఎలా ఉందో చూడాలి.