Begin typing your search above and press return to search.

అమావాస్య చీకట్లో అనైతిక పొత్తు

By:  Tupaki Desk   |   5 Nov 2018 5:30 PM GMT
అమావాస్య చీకట్లో అనైతిక పొత్తు
X
ఇంకా పండుగ రెండు రోజులు ఉండగానే రాష్ట్రంలో దీపావళి కళ కనిపిస్తోంది. సూర్యకారం - కాగితంలా కలిసి పేలతామన్న టీడీపీ - కాంగ్రెస్‌ పెనవేసుకున్న పొత్తుపై ఇటు రెండు పార్టీల నేతలు నిప్పు పెట్టకముందే నీళ్లు చల్లుతున్నారు. కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటానని చెప్పిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి - రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పని చేయడం వంటి బుద్ధిమాలిన పని మరొకటి ఉండదని - అలాంటి పని తమ నాయకుడు చంద్రబాబు చేయబోరని తారాజువ్వలా ఎగసిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తీరా పొత్తు పొడిచాక.. తూచ్‌ తూచ్‌ అంటూ తుస్సుమన్నారు.

రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ పర్యటన సందర్భంగా ఏం సాధించారని వస్తున్నారండీ.. రాష్ట్రాన్ని ముక్కలు చేసి అన్యాయం చేశారనా.. కత్తితో పొడిచి గాయం ఎలా ఉంది చూద్దామనా అంటూ చిటపటలాడిన సీఎం చంద్రబాబు.. తీరా కాంగ్రెస్‌ తో జత కట్టాక.. కాంగ్రెస్‌ పార్టీతోనే వెలుగు జిలుగులంటూ ముందుగానే రాష్ట్రానికి దీపావళి వచ్చేసినంత సంబరంగా చెప్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఏళ్ల తరబడి నాయకులు మారినా - ప్రభుత్వాలు మారినా.. పార్టీల పల్లకిని తమ భుజస్కందాలపై మోసిన కార్యకర్తలు మాత్రం.. ఇది అనైతిక పొత్తేనని.. సూర్యకారం - మందు సామగ్రి సరైన రీతిలో వాడకపోతే చిన్న బాంబు కాస్తా.. విస్పోటనంగా మారి తమనే కాల్చేస్తుందని - ఇప్పుడు కాంగ్రెస్ - టీడీపీ పొత్తు కూడా ఇలాంటిదేనని ఆందోళన చెందుతున్నారు

మరో వైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నేతల మధ్య అంతర్గత చిచ్చు పెట్టారని - ఇప్పుడు కాంగ్రెస్‌ తో పొత్తు కారణంగా కొన్ని సీట్లు వదులుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నాయకుల మధ్య విభేదాలు ఎన్నికల వేళ చిచ్చు బుడ్డుల్లా ఒక్కసారి ఎగసి పడతాయని ఆయా పార్టీల నేతలే అంటున్నారు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో బలం లేకపోయినా చాంతాడంత జాబితాతో మహాకూటమితో చిచ్చు పెట్టిన తెలుగుదేశం పార్టీకి.. తాము పెట్టిన చిచ్చు.. ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి తమనే బాంబులా కాలుస్తుందేమోనని భయపడుతున్నారు. అధికారమే పరమావధిగా అనైతిక ప్రమిదలో అంతర్గత విభేదాలనే నూనెగా పోసి.. ఆశల వత్తి వెలిగించిన తెలుగుదేశం పార్టీని,.. ప్రజాగ్రహమనే చీకట్లో దీపావళి అమావాస్య కలిపేస్తుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.