Begin typing your search above and press return to search.

చంద్రబాబు కొత్త స్లోగన్.. గో బ్యాక్ టు వేదాస్

By:  Tupaki Desk   |   18 Dec 2018 6:35 AM GMT
చంద్రబాబు కొత్త స్లోగన్.. గో బ్యాక్ టు వేదాస్
X
‘ఆ విధంగా ముందుకుపోదాం’ అంటూ నిత్యం చెప్పే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు మళ్లీ ‘గో బ్యాక్ టు వేదాస్’ అంటున్నారు. హైటెక్ సీఎంనంటూ గొప్పలు పోయే బాబుగారు ఈవీఎంలను చూసి భయపడుతూ బ్యాలట్ పేపరే బెస్ట్ అంటున్నారు. దీంతో.. టెక్నాలజీకి ఆద్యుడిననే బాబుకి ఏమైంది..? అప్‌డేట్ కాలేకపోతున్నారా? అవుట్ డేటెడ్ అయిపోయారా? లేదంటే రానున్న ఎన్నికల్లో ఓటమికి ఇప్పటి నుంచే సాకులు వెతుకుతున్నారా? అన్న చర్చలు మొదలయ్యాయి.

చంద్రబాబునాయుడు తాజాగా ఈవీఎంలపై యుద్దం ప్రకటించారు. తెలంగాణలో ఈవీఎంల వల్లే కూటమి ఓడిపోయిందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇప్పుడు మళ్లీ పాత పద్ధతి అయిన బ్యాలట్ పేపర్లు కావాలంటున్నారు. నిజానికి ఈవీఎంలపై చంద్రబాబు అనేక పిల్లిమొగ్గలు వేస్తున్నారు. ఒకప్పుడు ఆయనే వీటిని స్వాగతించారు. ఆ తరువాత బీజేపీతో కలిసి దీన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు 2008లో ఈవీఎంలకు వ్యతిరేకంగా ‘డెమొక్రసీ ఎట్ రిస్క్: కెన్ వి ట్రస్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్’ అంటూ రాసిన పుస్తకంలో చంద్రబాబు ప్రత్యేక సందేశం కూడా రాశారు. ఆయన గెలిచినప్పుడంతా ఈవీఎంలు గొప్పవని చెప్పడం... ఓడిపోయినప్పుడంతా వాటిని విమర్శించడం చేస్తూ వచ్చారు.

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి చంద్రబాబే కారణమన్న విమర్శలు వస్తుండడంతో వాటి నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు మరోసారి ఈవీఎంలను పావుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఓడిపోయినా కూడా నెపం ఈవీఎంలపై నెట్టేయొచ్చన్నదీ ఆయన ప్లానుగా తెలుస్తోంది.