Begin typing your search above and press return to search.

బాబుకు అచ్చిరాని బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌

By:  Tupaki Desk   |   23 Nov 2017 7:14 AM GMT
బాబుకు అచ్చిరాని బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ అచ్చిరాన‌ట్లుంది. మాజీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు వివాదంతో బాబు ఆశ‌యాల‌పై అనుమానాలు క‌లుగ‌క తాజాగా మ‌రో వివాదం ముసురుకుంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్యపై బ్రాహ్మణ సంఘాల్లో తిరుగుబాటు మొదలయింది. పార్టీ - ప్రభుత్వ కార్యక్రమాలు - కార్పొరేషన్ పథకాల ప్రచారం బదులు తన సొంత సంస్థను ప్రోత్సహిస్తోన్న ఆయనను తక్షణం తొలగించాలని రాష్ట్రంలోని వివిధ బ్రాహ్మణ సంఘాలు పార్టీ కార్యాలయానికి వెల్లువలా ఫిర్యాదులు పంపుతున్నారు. తాజాగా ఆలిండియా బ్రాహ్మిన్ ఫెడరేషన్ అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయ నేతలు - ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చైర్మన్‌ పై ఫిర్యాదు అందించారు.

పేద - మధ్య తరగతి బ్రాహ్మణుల సంక్షేమం కోసం చంద్రబాబు ఏర్పాటుచేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ ఆశించిన స్థాయిలో ఆ సామాజిక వర్గం వారి చెంతకు చేరడం లేదని సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు ముత్తనపల్ల శివకృష్ణప్రసాద్ - రాష్ట్ర నేతలు యండవల్లి సుబ్బారావు - కొనంకి మారుతి - సాగి శ్రీనివాస శాస్ర్తీ - తుళ్లూరు ప్రకాష్‌ తో కూడిన ప్రతినిధి బృందం పార్టీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ - ఎమ్మెల్సీ వీవీవీ చౌదరిని కలిసి ఫిర్యాదు చేసి - సీఎంకు వినతిపత్రం ఇచ్చింది. అనంతరం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చైర్మన్‌ ను తొలగించకపోతే, కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యమే వ్యర్థమవుతుందని స్పష్టం చేశారు. కార్పొరేషన్ చైర్మన్‌ గా నియమితులైన ఆనందసూర్య ఆర్థిక ఆరోపణలపై గతంలో రాష్ట్రంలోని బ్రాహ్మణ వర్గానికి చెందిన టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. చైర్మన్‌ గా బాధ్యతలు తీసుకున్న ఆరునెలల్లో ఇప్పటివరకూ దరఖాస్తుదారులకు నయా పైసా లబ్ధి జరగలేదన్నారు. ఆయన కార్పొరేషన్ చైర్మన్‌ గా కంటే ఆర్‌ బీఎస్ అధ్యక్షుడిగానే ఎక్కువగా పనిచేస్తున్నారని, ఆ సంస్థలో సభ్యత్వం తీసుకున్న వారికే పోస్టులు ఇస్తున్నారని, దీనిపై విచారణ చేయించాలని కోరారు. ఆయన సొంత సంస్థలో సభ్యులైన వారికే పథకాలు అందిస్తామని బహిరంగంగా చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

చైర్మన్ ఏకపక్ష నిర్ణయాల వల్ల కార్పొరేషన్‌ ను హైకోర్టు కీడ్చి ప్రభుత్వ వాదన ఓడిపోయేలా చేసిన చర్యతో - ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలోని 13 జిల్లాలో పార్టీకి సేవ చేస్తున్న ఎంతోమంది ఉండగా - పరాయి రాష్ట్రం వారిని తీసుకువచ్చి చైర్మన్ ఇవ్వడం వల్ల లక్ష్యం దెబ్బతింటోందన్నారు. కార్పొరేషన్ పదవులను పోలీసు కేసులున్న వారికి ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన కార్యక్రమాల కమిటీ చైర్మన్ - ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి.. చైర్మన్‌ పై వివిధ జిల్లాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని - పార్టీ అనుమతి లేకుండా ఎవరినీ నియమించవద్దని ఆదేశించామన్నారు.