Begin typing your search above and press return to search.

అమరావతికి శ్రీరామరక్ష వారేనట

By:  Tupaki Desk   |   13 Oct 2015 10:23 AM GMT
అమరావతికి శ్రీరామరక్ష వారేనట
X
చరిత్రలో నిలిచిపోయే రీతిలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు సొంత గ్రామమైన చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో సేకరించిన పుట్ట మన్ను, గోదావరి జలాలకు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పవిత్ర భావంతో రాజధాని నిర్మించాలని చెప్పిన ఆయన... శంకుస్థాపనలో ప్రతి గ్రామం నుంచి సేకరించిన సంకల్ప పత్రాలు ఉంటాయన్నారు. పవిత్ర భావనతో, అందరి మనోభావాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 16 వేల గ్రామాల నుంచి మట్టి, నీరుతో పాటు సంకల్ప పత్రాలు సేకరిస్తామని వెల్లడించారు. అందరి సంకల్పంతో రాజధాని కట్టుకోవాల్సిన అవసరముందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 16వేల గ్రామాల సంకల్ప సిద్ధే అభివృద్ధికి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. శంకుస్థాపన కోసం పుట్టకు పూజలు చేసిన ముఖ్యమంత్రి పుట్ట నుంచి మట్టిని సేకరించారు.

అమరావతికి స్థాన, వాస్తు బలం ఉందని చంద్రబాబు చెప్పారు. ప్రపంచమంతా ఆశ్చర్యంతో చూసేలా రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుందని చెప్పిన ఆయన దీనికి ప్రజల సహకారం తప్పనిసరి అని అన్నారు. కాగా ఏపీ మంత్రులు కూడా వారివారి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు వారివారి స్వగ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మట్టి, నీరును సేకరిస్తున్నారు. ఏపీ మంత్రి యనమల ఆయన స్వగ్రామం కాకినాడలో మనమట్టి - మన నీరు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి... రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం మట్టిని సేకరించారు. మంత్రితో పాటు ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అదే విధంగా గుంటూరు జిల్లా నాదెండ్లలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మన మట్టి - మన నీరు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాదెండ్లలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాజధాని కోసం మట్టి, నీరును సేకరించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆంజనేయులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తన సొంత గ్రామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని భీమేశ్వరంలో నిర్వహించిన కార్యమ్రంలో పాల్గొన్నారు.