Begin typing your search above and press return to search.

లోకేష్ పోటీపై.. బాబు అలా స్పందించారా!

By:  Tupaki Desk   |   14 March 2019 4:47 AM GMT
లోకేష్ పోటీపై.. బాబు అలా స్పందించారా!
X
తనయుడిని తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దింపబోతూ ఉన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఇప్పటికే తనయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు..తొలి సారి నామినేటెడ్ పదవితో కాపాడుకున్నాడు. ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లేకుండా ఎమ్మెల్సీ నామినేషన్ తో ఏకంగా మంత్రిని చేశారు. గతంలో ఇలాంటి వ్యవహారాలను చంద్రబాబు నాయుడు బాగా విమర్శించే వారు.

మన్మోహన్ సింగ్ వంటి మేధావి నామినేటెడ్ రాజ్యసభ పదవితో… ప్రధాని పదవిని చేపడితే బాబు ఆయన విషయంలో అనుచితంగా మాట్లాడారు. రాజ్యాంగంలో ఆ మేరకు సౌలభ్యం ఉన్నా.. మన్మోహన్ ను బాబు కించ పరుస్తూ మాట్లాడారు. ప్రధాని ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గలేదంటూ ఇష్టానుసారం మాట్లాడారు. అలాంటి ప్రధానిని కలిసేది లేదంటూ అప్పట్లో చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. మన్మోహన్ దొడ్డిదారిన ప్రధాని అయ్యారంటూ.. అవమానించేలా మాట్లాడారు.

అలా మాట్లాడిన చంద్రబాబు తీరా తన తనయుడిని మాత్రం నామినేటెడ్ పదవితోనే మంత్రిని చేశాడు. అదీ చంద్రబాబు పాటించే ద్వంద్వ ప్రమాణాల తీరు.

ఇక ఈ సారి మాత్రం బాబు తప్పించుకోలేకపోతున్నారు. తనయుడిని పోటీ చేయించి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసం చాలా కసరత్తే చేశారు. రకరకాల లీకులు ఇచ్చారు. చివరకు లోకేష్ కోసం మంగళగిరి సీటును ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఈ రోజు అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారం.

ఇక లోకేష్ ను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించడాన్ని ఖరారు చేస్తూ చంద్రబాబు నాయుడు ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారట పార్టీ శ్రేణులతో.. ‘నా గెలుపు గురించి కూడా మీరెవరూ పట్టించుకోవద్దు.. లోకేష్ ను మాత్రం గెలిపించాల్సిందే.. ఎంత ఖర్చుకు కూడా వెనుకాడవద్దు.. లోకేష్ గెలిచి తీరాలి..’ అని పార్టీ శ్రేణుల వద్ద చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.

ఆఫ్ ద రికార్డుగా ఈ ప్రచారం జరుగుతూ ఉంది. లోకేష్ ఈ ఎన్నికల్లో నెగ్గడం చంద్రబాబుకు ఎంత ప్రతిష్టాత్మకమో చెప్పనక్కర్లేదు. అందుకే బాబు ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే సేఫెస్ట్ సీట్లో తనయుడిని పోటీ చేయించలేకపోయారు చంద్రబాబు. మంగళగిరి తెలుగుదేశం పార్టీకి మరీ కంచుకోట అనే పరిస్థితి లేదనేది మాత్రం వాస్తవం!