Begin typing your search above and press return to search.

బాబు కలిస్తే సంక్షేమం...మేం కలిస్తే లొసుగా...

By:  Tupaki Desk   |   17 Jan 2019 5:11 AM GMT
బాబు కలిస్తే సంక్షేమం...మేం కలిస్తే లొసుగా...
X
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని కలవడం తెలుగుదేశం పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదంటున్నారు. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో భారతీయ జనతా పార్టీ ఏలికలో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ఇద్దరు నాయకులు - రెండు పార్టీలు కలిసి చర్చిస్తే వచ్చే తప్పేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకుని కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలను కలుస్తున్నారని - ఆయన ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులను కలవగా లేనిది తమ నాయకుడ్ని మరో తెలుగు రాష్ట్రం నాయకులు కలిస్తే తప్పేమిటనే ప్రశ్నను సంధిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా బద్ధ శత్రువులై కాంగ్రెస్ పార్టీతోనే కలవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని వారంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణలో పోటీ చేసిన చంద్రబాబు నాయుడుకు తప్పు కనిపించ లేదా అని వారంటున్నారు.

నందమూరి హరిక్రిష్ణ మరణం తర్వాత తనను కలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అగ్ర నేత కె.చంద్రశేఖర రావుతో పొత్తు గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి - వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కలిస్తే ఎందుకు తప్పుగా తోస్తోందని రాజకీయ పండితులు కూడా ప్రశ్నిస్తున్నారు. తాను తెలంగాణలో ప్రచారం చేసినప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా ప్రచారం చేసుకోవచ్చు - పోటీ చేయవచ్చు అని ప్రకటించిన చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు టీఆర్ ఎస్ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు కలిస్తే ఎందుకు అభ్యంతరమని అంటున్నారు. మీరు కలిస్తే సంక్షేమం... ఎదుటి వారు కలిస్తే అపరాధము అన్నట్లుగా చంద్రబాబు నాయుడు - తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాను ఏర్పాటు చేయదలచుకున్న ఫెడరల్ ఫ్రంట్ కోసం అన్ని రాష్ట్రాల్లోను ప్రాంతీయ పార్టీలకు చెందిన వారిని కలుస్తున్నారని - అలాగే జగన్ మోహన్ రెడ్డిని కూడా కలుస్తారని అంటున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంత రచ్చ చేస్తే అంత మంచి జరుగుతుందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నాయి.