Begin typing your search above and press return to search.

ఏపీ సచివాలయ ఉద్యోగులపై ఎంత ఔదార్యం

By:  Tupaki Desk   |   24 May 2016 7:50 AM GMT
ఏపీ సచివాలయ ఉద్యోగులపై ఎంత ఔదార్యం
X
రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది? ఈ రోజు కోట్లాదిమంది ఆంధ్రుల ఇబ్బందులకు కారణం ఏంటి? అసలు తెలంగాణ ఉద్యమం అంత ఉవ్వెత్తున ఎగిసి.. తెలంగాణ ప్రజల ఆమోదానికి దారి తీసిన కారణాలేంటని చూస్తే.. మూడే మూడు అంశాలు కనిపిస్తాయి. నిధులు.. నీళ్లు.. నియమకాలు అనే మూడింటి కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందన్న వాస్తవాన్ని విస్మరించలేని పరిస్థితి. ఈ మూడింటిలో మూడోదైన నియమకాల విషయానికి వస్తే నాటి ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలో ఏపీ ప్రాంతానికి చెందిన ఉద్యోగుల హడావుడి ఎక్కువగా ఉండటం.. సచివాలయంలో స్థానికంగా ఉండే తెలంగాణ వారి కంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉండటం.. తెలంగాణ వారి అసంతృప్తికి కారణమైంది.

అది అంతకంతకూ పెరిగి.. విభజన వరకూ వెళ్లింది. అంటే.. ఈ రోజు కోట్లాదిమంది ఏపీ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు.. కోట్లాదిమంది సీమాంధ్రుల మీద దోచుకునేవాళ్లన్న ముద్ర పడటంలో సచివాలయానికి చెందిన ఏపీ ఉద్యోగుల పాత్ర ఎంతోకొంత ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. అంటే.. సచివాలయంలో పని చేసే గుప్పెడు ఏపీ ఉద్యోగుల కక్కుర్తి కోట్లాదిమందికి శాపంగా మారిందన్న మాట.

ఈ రోజున ఇన్ని ఇబ్బందులకు అసలు కారణమైన వారి పట్ల ఎలా వ్యవహరించాలి? నిజానికి వారు కానీ స్వార్థంతో వ్యవహరించి ఉండకపోతే.. విభజన లాంటి ఉత్పాతాలు వచ్చేవి కావేమో..? ఇలాంటి వాదన తెర మీదకు తెచ్చినప్పుడు.. మరి.. నిధులు.. నీళ్ల మాటేమిటని ప్రశ్నించొచ్చు. నిధులకు సంబంధించిన చేసిన తప్పులకు.. ఇప్పటికే కొన్నిపార్టీలు.. కొందరు రాజకీయ నాయలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

తమ నిర్లక్ష్యానికి.. తాము చేసిన తప్పులకు రాజకీయ పార్టీలు.. నేతలు శిక్షలు అనుభవిస్తున్న వేళ.. విభజనకు కీలకంగా వ్యవహరించిన ఏపీ సచివాలయ ఉద్యోగులకు పడిన శిక్షేమిటి? అంటే.. వారు హైదరాబాద్ ను వదిలేసి అమరావతికి వెళ్లాల్సి రావటం. నిజానికి తప్పులు చేసిన పలువురు ఇప్పటికే రిటైర్ అయ్యారు. ఉన్న వారిలో కొద్దిమందికి అమరావతికి వెళ్లటం పెద్ద ఇబ్బంది లేదు. ఇక.. అసలు ఇబ్బంది అంతా కొద్ది మందికి మాత్రమే. కానీ.. అలాంటి వారికి సైతం ఎలాంటి నొప్పి కలగకుండా ఉండేందుకు తాజాగా ఏపీ సర్కారు ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.

అమరావతిలో పని చేయాల్సిన ఏపీ సచివాలయ ఉద్యోగులు వారంలో ఐదు రోజుల మాత్రమే పని చేసేలా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు సర్కారు తాజాగా అధికారిక ఉత్తర్వుల్ని కూడా జారీ చేశారు. దీని ప్రకారం అమరావతిలో విధులు నిర్వహించే హైదరాబాద్ సచివాలయ సిబ్బంది ఏడాది పాటు వారంలో ఐదు రోజుల మాత్రమే పని చేస్తే సరిపోతుంది. వరుసగా వచ్చే సెలవులు.. పండుగలు.. పర్వదినాలు.. రాజకీయ ఆందోళనలు ఇలా చెప్పుకుంటూ పోతే చేసే పని కంటే కూడా సెలవులే అధికమనిపించక తప్పదు. విభజనకు కారణమైన ముఖ్యులకు సౌకర్యాల మీద సౌకర్యాలు కల్పించేందుకు బాబు సర్కారు విశేష ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం.

జీతాల పెంపు.. వసతులు కల్పిస్తున్న వేళ కూడా అమరావతికి తరలి రావటానికి సవాలచ్చ సమస్యల్ని తెర మీదకు తెస్తున్న సచివాలయ ఉద్యోగులు.. తమ కారణంగానే ఏపీ ప్రజలుఇన్ని ఇక్కట్లకు గురి అవుతున్నారన్న విషయాన్ని ఎందుకు గుర్తించరన్న సందేహం రాక మానదు. కానీ.. వారు అలాంటివేమీ గుర్తిస్తున్నట్లుగా కనిపించదు.

వారానికి ఐదు రోజులపని చొప్పున పని చేస్తే.. పనులు జరిగేదెంత? అన్నది ఒక ప్రశ్న. మరో కీలకమైన అంశం ఏమిటంటే.. వారానికి ఐదు రోజులు పని అంటే.. నాలుగోరోజు నుంచే పని ఎంత త్వరగా ముగించేసి హైదరాబాద్కు వెళ్లేందుకు ఎంత హడావుడిగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఓపక్క శరవేగంతో వృద్ధి చెందాల్సిన ఏపీ రాష్ట్రం.. ఉద్యోగులకు వసతులు.. వారికి ఇబ్బంది లేకుండా ఉండే అంశాల మీదనే ఎక్కువ దృష్టి పెడితే..ఏపీ రాష్ట్ర భవిష్యత్తు మాటేమిటి? అన్నది అతి కీలకమైన ప్రశ్న. ఉద్యోగులు తమ పని వేళల కంటే నాలుగైదుగంటలు అదనంగా పని చేయాల్సిన వేళ.. వారానికి ఐదు రోజుల లాంటి వసతులు అవసరమా? అన్నది సగటు సీమాంధ్రుడి మదిలో మెదులుతున్న ప్రశ్న.