Begin typing your search above and press return to search.

తమ్ముళ్ల దురుసు మీద మాట్లాడాలి బాబు..

By:  Tupaki Desk   |   27 March 2017 5:38 AM GMT
తమ్ముళ్ల దురుసు మీద మాట్లాడాలి బాబు..
X
నిత్యం నీతులు వల్లించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు..తమ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో అధికారులపై రెచ్చిపోవటం.. వారిపై భౌతికదాడులు చేసేందుకు సైతం వెనుకాడని తత్వ్తం ఇటీవల కాలంలో అంతకంతకూ పెరగుతోంది. ఆ మధ్య ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారితే..తాజాగా రవాణా శాఖ కమిషనర్ బలసుబ్రమణ్యం పట్ల టీడీపీ ఎంపీ.. ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించిన వైనంపై బాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిపైనా దురుసుగా వ్యవహరించేందుకు సైతం వెనక్కితగ్గని తమ్ముళ్ల బరితెగింపు షాకింగ్ గా మారింది. ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఇందుకు కారణమైన నేతల్ని తన వద్దకు పిలిపించుకొని తలంటు పోసిన చంద్రబాబు.. నోరు మూసుకొని..వెళ్లి క్షమాపణలు చెప్పాలంటూ ఆదేశం జారీ చేయటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లోజరిగిన దానిపై విచారం వ్యక్తం చేస్తూ.. సారీ చెప్పేశారు.

తప్పు చేసిన వాళ్లు ఎవరైనా ఉపేక్షించేదిలేదని.. వారిపై చర్యలు తీసుకోవటానికి వెనుకాడేది లేదంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. తాజాగా ఐపీఎస్ అధికారిపై తన పార్టీ నేతలు వ్యవహరించిన తీరుపై వివరణ ఇస్తారా? అన్నది ప్రశ్న. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే.. మొదట తమ తప్పు ఏమీ లేదని వాదించిన నేతలు..ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని.. ఆక్షింతలు వేసిన తర్వాత ఓకే అంటున్న వైనం చూస్తే.. అధికార పార్టీ నేతలు ఇంత బాధ్యతా రాహిత్యంతో ఎందుకు ప్రవర్తిస్తున్నరన్నది పెద్ద ప్రశ్న. గడిచినమూడేళ్ల కాలంలో ఇలాంటివి తరచూ చోటు చేసుకుంటున్నాయి.

ప్రతిదీ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటారని చెప్పలేం. మీడియాలో ప్రముఖంగా వచ్చి..రచ్చ అయ్యాక మాత్రమే చంద్రబాబు రెస్పాండ్ అవుతున్నారే తప్పించి.. విషయం జరిగిన వెంటనే ఆయనేమీ స్పందించటం లేదని చెప్పక తప్పదు. ప్రజలు ఏమనుకుంటారో?ప్రభుత్వం మీద ఉన్న ఇమేజ్ దెబ్బ తింటుందన్న అంశం మీదనే దృష్టి తప్పించి.. అధికారులపై అధికారపక్షం చేస్తున్న అనాగరికమైన దాడులకు చెక్ పెట్టేలా కఠిన నిర్ణయాలు ఏం తీసుకోలేదని చెప్పక తప్పదు.

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పలువురు నేరుగా అడగాలనుకుంటున్నది ఒక్కటే. ప్రతివిషయానికి నీతులు చెప్పే చంద్రబాబు.. తన పార్టీ నేత‌లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుపై బహిరంగ వివరణను ఇచ్చే దమ్ముందా? అని. సారీ చెప్పటానికి కాస్త ముందుగా మీడియాతో మాట్లాడుతూ.. తామేం తప్పు చేయలేదని చెప్పుకున్న నేతలు.. చంద్రబాబును కలిసిన తర్వాత మాత్రం సారీ ఎందుకు చెప్పారు?తప్పు చేయనప్పుడు మొదట్నించి చెబుతున్న మాటల మీదే ఎందుకు నిలబడటం లేదన్నది చూస్తే..తమ్ముళ్ల తీరు ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/