Begin typing your search above and press return to search.

చంద్రబాబు మౌనమే వినాశకారి!

By:  Tupaki Desk   |   13 March 2018 9:38 AM GMT
చంద్రబాబు మౌనమే వినాశకారి!
X
చంద్రబాబునాయుడు మళ్లీ మౌనాన్ని ఆశ్రయించారు. ఒక రాష్ట్రానికి అధినేతగా ఉంటూనే.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, జరుగుతున్నదని తెలిసినప్పుడు కనీసం నోరు తెరచి మాట్లాడడానికి ధైర్యం లేక దానికి సంయమనం అని, వేచిచూడడం అని మాయపేర్లు పెట్టుకుని.. పాటిస్తున్న మౌనమే.. రాష్ట్రానికి వినాశకారిగా మారుతున్నదనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పేసిన తర్వాత కూడా.. చంద్రబాబునాయుడు ఇంకా మౌనంగానే ఉన్నారంటే.. ఆ జోన్ అనే డిమాండును ఇంతటితో వదిలేసినట్టేనా? లేదా, ఆ అంశం ఎలా తగలడితే నాకేంటి.. నిధుల రూపంలో డబ్బులొస్తే చాలు అనే భావమా.. ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడంలేదని ప్రజలు అంటున్నారు.

విభజనానంతరం రాష్ట్రానికి చట్టంలోని హక్కుల ప్రకారంగా దక్కవలసిన వాటిని యథాతథంగా సాధించి.. రాష్ట్రానికి మేలు చేకూర్చే విషయంలో చంద్రబాబునాయుడు తొలినుంచి నాటకాలే ఆడుతున్నారనే అభిప్రాయాలు జనసందోహంలో బాగా ఉన్నాయి.

ప్రత్యేకహోదా గురించి వైకాపా తొలినుంచి పోరాడుతోంటే పట్టించుకోకుండా.. ఇప్పుడు ఇక అన్ని పార్టీలూ అదే పోరాటానికి దిగిన తర్వాత.. ఆ జెండా భుజానికెత్తుకున్నారు. ప్యాకేజీ అంటూ లోపాయికారీ ఒప్పందాలకు పాల్పడిన చంద్రబాబు.. అక్కడ రూపాయి రాకపోయే సరికి తిరిగి హోదా పాటపాడుతున్నారనే విమర్శ ఉంది. అదే మాదిరిగా విశాఖ రైల్వేజోన్ - కడప ఉక్కు పరివ్రమ సంగతుల్ని ఆయన సీరియస్ గా ప్రస్తావించడం లేదు. హోదా కుదరదు అని చెప్పినట్టే రైల్వేజోన్ కూడా కుదరదు అని కేంద్రం చెప్పేసిన తర్వాత కూడా.. ఇంకా చంద్రబాబు తన పార్టీ ద్వారా ప్రత్యక్ష పోరాటానికి దిగకుండా.. కనీసం ఈ విషయం మీద నోరు మెదపకుండా మౌనం పాటించడం.. రాష్ట్రాన్నంతా ఏకతాటిపైకి తెచ్చి.. కేంద్రంలో ప్రకంపనాలు పుట్టించాల్సిన నాయకుడే మౌనంగా ఉండడమే జాతికి నష్ట దాయకం అని పలువురు భావిస్తున్నారు.