Begin typing your search above and press return to search.

గ‌మ‌నించారా? కేసీఆర్‌ను ఒక్క‌మాట అన‌ని బాబు

By:  Tupaki Desk   |   24 May 2018 5:37 PM GMT
గ‌మ‌నించారా?  కేసీఆర్‌ను ఒక్క‌మాట అన‌ని బాబు
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మ‌హానాడు ముగిసింది. సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ఏడాది ముందు హైద‌రాబాద్ వేదిక‌గా నిర్వ‌హించే ఈ స‌ద‌స్సుకు ఎంతో ప్రాధాన్యం ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ‌హానాడు ఉసురుమ‌నిపించింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ స‌ద‌స్సు సాక్షిగా జాతీయ రాజ‌కీయాల గురించి వివ‌రించిన తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు వివ‌రించారు. త‌మ‌దే ప్ర‌ధాన పాత్ర అని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా తెలంగాణ‌లో బలోపేతం అవుతుంద‌ని అన్నారు. అయితే ఇంత భారీ ప్ర‌క‌న‌ట‌లు చేసిన చంద్ర‌బాబు అస‌లు విష‌యం మాత్రం వెల్ల‌డించ‌లేద‌ని అంటున్నారు.

తెలంగాణలో టీడీపీ తిరుగులేని శక్తిగా ఎదగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. స్వార్థం కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మే 24న చరిత్ర తిరగరాసే రోజని, టీడీపీకి పూర్వ వైభవం తేవాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ లేకుండా 2019లో ఎవరు ఏమీ చేయలేరని, కీలక పాత్ర మనదేనని చంద్రబాబు చెప్పారు. ప్రధానిని నిర్ణయించేది మనమేనని అన్నారు. కర్ణాటకలో తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ పార్టీనే సీఎం పదవిని పొందిన విష‌యాన్ని గుర్తు చేస్తూ కర్ణాటకలో జరిగిందే.. తెలంగాణలో రిపీట్ అవుతుందని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఏం చేస్తుందో ప్రజలకు తెలపాలని కార్యకర్తలకు చెప్పారు. ప్రధానమంత్రి పదవిపై తనకు ఆశ లేదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కీలకంగా మారుతుందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు, మెట్రో రైలు, హైటెక్ సిటీల నిర్మాణంలో తెలుగుదేశం ముద్ర స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ వివాదంపై కూడా చంద్ర‌బాబు స్పందించారు. తిరుమల వెంకన్న ఆభరణాలు నా వద్ద ఉన్నాయని కొందరు ఆరోపిస్తుండ‌టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్ర‌బాబు అన్నారు. త‌నకు ప్రాణభిక్ష పెట్టింది తిరుమల వెంకటేశ్వరస్వామేని బాబు తెలిపారు. రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీ తెలంగాణ‌లో ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌న్నారు. అయితే ఇలా అనేక అంశాల‌ను పంచుకున్న చంద్ర‌బాబు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను మాట‌ మాత్రమైనా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైపెచ్చు రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాల గురించి కూడా ఆయ‌న ఎక్క‌డా విమ‌ర్శించ‌లేదు. ఇదంతా ఇటీవ‌లి తెర‌మీద‌కు వ‌చ్చిన ఓటుకు నోటు మ‌హిమా అనే చ‌ర్చ సైతం సాగుతుండ‌టం కొస‌మెరుపు.