Begin typing your search above and press return to search.

బాబు కాపు కోటా బౌన్స్ అవుతోందా?

By:  Tupaki Desk   |   4 Dec 2017 6:04 PM GMT
బాబు కాపు కోటా బౌన్స్ అవుతోందా?
X
ముచ్చ‌ట‌గా మూడున్న‌రేళ్ల త‌ర్వాత ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు నిలుపుకున్న హామీ ఆ పార్టీలో నేత‌ల మ‌ధ్య చీలిక‌కు కార‌ణ‌మైందా? తెలుగుదేశం పార్టీకి పునాదిరాళ్లయిన బీసీలు ఇప్పుడు టీడీపీపై భగ్గుమంటున్నారా? త‌మ‌కు అన్యాయం చేసే రీతిలో ఉన్న కాపులకు బీసీ కోటాపై వారు ర‌గిలిపోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ వర్గాలు రోడ్డెక్కుతుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్తున్నారు. స్వయంగా అధికార పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తిరుగుబాటు బావుటా ఎగురవేయడం, రిజర్వేషన్ ప్రకటించిన రోజునే రాష్ట్రంలో బీసీలు రోడ్డెక్కడం పార్టీకి తలనొప్పిలా మారిందని వివ‌రిస్తున్నారు.

కాపుల‌కు బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను మెజార్టీ బీసీ నేత‌లు మొద‌టి నుంచి వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్పటికీ....కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినా దానివల్ల బీసీలకు ఎలాంటి నష్టం ఉండదని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తొలి నుంచీ చెబుతున్నారు. ప్రధానంగా బీసీలు భయపడుతున్నట్లు కాపులకు రాజకీయ రిజర్వేషన్లు ఉండవన్న దానిపై బాబు చాలాకాలం నుంచీ స్పష్టత ఇస్తూ వస్తున్నారు. అయితే
చిత్రంగా ఇప్పుడు ఆ రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ...బీసీల నుంచి బాబు నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త మొద‌ల‌యింది.కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభ తీర్మానించిన రోజు కాపు ప్రతినిధులంతా బాబుకు మిఠాయిలు తినిపించడం, కాపు నేతలు సంబరాలు చేసుకోవడం, సీఎం ప్లెక్సీలకు పాలాభిషేకం చేయడం వంటి ఆనందోత్సాహాలు బీసీ వర్గాలను మరింత రెచ్చగొట్టినట్టయింది. ఈ క్రమంలో చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు సంబరాల‌కు దూరంగా ఉండాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది.

కాగా, తెలుగుదేశం పార్టీలోని కాపు నేత‌లు వ‌ర్సెస్ బీసీ నేత‌లు అన్న‌ట్లుగా చీలిపోయిన‌ట్లు తెలుస్తోంది.కేబినెట్‌లో ఉన్న బీసీ మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాపు రిజర్వేషన్‌ను అడ్డుకోనందుకే కాపులు రిజర్వేషన్ సాధించుకోగలిగారని, తమ జాతి నేతల వైఫల్యమే దానికి కారణమన్న ఆగ్రహం బీసీ సంఘాల్లో రగులుకుంది.నిజానికి కాపు మంత్రులు - ప్రజాప్రతినిధులంతా మొదటి నుంచీ రిజర్వేషన్‌పై కలసికట్టుగా ఉంటూ వ్యూహాత్మకంగా సర్కారుపై ఒత్తిడి చేస్తుంటే, తమ జాతి నేతలంతా ఐకమత్యం లేక తమ వారసులకు ప్రాజెక్టులు సంపాదించుకోవడం - పదవులు పొందడం - కాపాడుకునే పనిలో ఉన్నారన్న ఆగ్రహం చాలాకాలం నుంచీ బీసీల్లో బహిరంగంగానే వ్యక్తమవుతోంది. బీసీ మంత్రులు గానీ, ఇటు పార్టీ బీసీ నేతలు గానీ తమ ఆవేద‌న‌ను వివరించకపోవడంతో ఇప్పుడు చిక్కులు వచ్చిపడుతున్నట్లు బీసీల ఆందోళనలు స్పష్టం చేస్తున్నాయి. తాజా పరిణామాలతో అటు బీసీ మంత్రులు - ఎమ్మెల్యేలు, -ఎమ్మెల్సీలు - నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఉన్న నేతలు చిక్కుల్లో పడ్డారు.

ఇక తెలంగాణకు చెందిన పార్టీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నాయకత్వమే ప్రకటించిన ఆర్ కృష్ణయ్య కూడా కాపు రిజర్వేషన్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేయడం పార్టీకి సంకటంగా పరిణమించింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ ప్రకటించిందని, దీన్ని తాము అడ్డుకోవడంతో పాటు బీసీ సంఘాల్లో చైతన్యం తెస్తామని ఆయన ప్రకటించారు. గత రెండేళ్ల నుంచి ఏపీలో పర్యటిస్తూ కాపులకు రిజర్వేషన్లు ఇస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాచర్ల సభలో హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఏపీలో బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అటు కాపు రిజర్వేషన్‌పై గతంలోనే కోర్టుకెళ్లిన బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరు రామకృష్ణయ్య ఈ నెల 10న గుంటూరులో బీసీ గర్జన నిర్వహించనున్నారు. స్థూలంగా...కాపు రిజ‌ర్వేష‌న్లు ఆ వ‌ర్గం ఓట్ల‌ను పొందేలా చేస్తుంద‌నుకుంటే...బ‌ల‌మైన మ‌ద్ద‌తుదారుగా ఉన్న బీసీల ఓట్ల‌ను దూరం చేసే ప‌రిస్థితిని క‌ల్పిస్తోంద‌ని తెలుగు త‌మ్ముళ్ల‌లో కొత్త ఆందోళ‌న మొద‌లైంది.