Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కంటే బాబే ముందున్నాడు

By:  Tupaki Desk   |   8 Oct 2015 3:40 PM GMT
ప‌వ‌న్ కంటే బాబే ముందున్నాడు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ‌నసేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే తానే ముందున్నాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం తెలుగు మీడియం పాఠశాలలను కొనసాగించవ‌ద్ద‌ని ఆదేశాలు ఇచ్చిన నేప‌థ్యంలో త‌మిళ‌నాడు సీఎం జ‌య‌లలిత‌కు చంద్ర‌బాబు లేఖ రాశారు. త‌మిళనాడులో తెలుగు భాషను గౌరవించాలని ఆ లేఖ‌లో చంద్ర‌బాబు విజ్ఞప్తి చేశారు.

తమిళనాట తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యల విషయంలో మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని చంద్ర‌బాబు జయలలితను లేఖలో కోరారు. తమిళనాడు ప్రభుత్వం తెలుగు మీడియం పాఠశాలలను కొనసాగించాలని, అలాగే పాఠశాల స్థాయిలో తెలుగును రెండో బోధనా భాషగా కొనసాగించాలని బాబు ప్ర‌స్తావించారు. ఏపీలో 60 శాతం మైనారిటీ పాఠశాలల్లో తమిళ భాషను బోధిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. త‌ద్వారా ప్ర‌వాసాంధ్రుల వికాసానికి తోడ్ప‌డిన‌ట్లు అవుతుంద‌ని తెలిపారు. ఈ ర‌కంగా నేరుగా సీఎం జయలలితకే త‌న వాద‌న‌ను వినిపించారు.

తెలుగు నిషేధంపై జ‌య‌ల‌లిత నిర్ణ‌యం త‌ర్వాత ఆ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌మిళ‌నాడు స‌ర్కారు నిర‌స‌న‌గా సెప్టెంబ‌రు నెలాఖరులో దీక్ష చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే సెప్టెంబ‌రు గ‌డిచిపోయినా ఈ దిశ‌గా అడుగులు వేయ‌లేదు. అక్టోబ‌రులో ప‌ది రోజులు గ‌డిచినా ప‌వ‌న్‌ స్పందన‌లేదు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు దూకుడుగా స్పందించి...త‌మిళ‌నాడు సీఎంకు లేఖ రాశారు. ఇటు ప్రభుత్వం త‌ర‌ఫున‌, అటు పార్టీ త‌ర‌ఫున బాబు స్పందించిన‌ట్ల‌యింద‌ని విశ్లేష‌కులు అంచ‌నావేస్తున్నారు.