Begin typing your search above and press return to search.

తమ్ముళ్లను పిలిచారు సరే.. టీ సీఎంను పిలవరా?

By:  Tupaki Desk   |   4 Oct 2015 11:30 AM GMT
తమ్ముళ్లను పిలిచారు సరే.. టీ సీఎంను పిలవరా?
X
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపనను దసరా రోజున చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని భారీగా చేపట్టటంతో పాటు.. చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు లక్ష మంది వరకూ ప్రజలు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు.

ఇక..వీవీఐపీల్లో జపాన్.. సింగపూర్ ప్రధానులతో పాటు దేశ ప్రధాని మోడీతోపాటు.. పెద్ద సంఖ్యలో కేంద్రమంత్రులు.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి రానున్నట్లు తెలిసిందే. అయితే.. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఇవ్వటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ.. ఆయా రాష్ట్రాలకు చెందిన నూతన కమిటీల చేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. దసరా రోజున ఏపీ సర్కారు నిర్వహించే అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలంటూ తెలంగాణ తెలుగుదేశం నేతల్ని కోరారు. ఈ కార్యక్రమానికి వచ్చే నేతలు ముందుగా పార్టీకి తెలియజేస్తే.. వసతి ఏర్పాట్లు చూస్తామని చెప్పుకొచ్చారు. తమ్ముళ్ల సంగతి సరే.. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి.. అధికారపక్ష నేతలకు ఏపీ శంకుస్థాపన కార్యక్రమ ఆహ్వానం ఉంటుందా? ఉంటే.. ఎవరెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

నిజానికి ఏపీ శంకుస్థాపన కార్యక్రమం ప్రభుత్వం పరంగా చేపడుతున్న నేపథ్యంలో.. బాబు పార్టీ నేతల్ని రమ్మని ఆహ్వానించటం కాస్త ఇబ్బందికరమే. దీనికి మించి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో.. వివిధ రాష్ట్రాల్లోని వారిని ఆహ్వానించిన చందంగా తెలంగాణ తమ్ముళ్లను కూడా పిలిస్తే బాగుండేది. అంతేకాదు.. తెలంగాణ తమ్ముళ్ల ప్రత్యేకం అన్నట్లుగా ఆహ్వానించటం సబబు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం.. అమరావతి శంకుస్థాపన ఏపీ రాజధాని కార్యక్రమం తప్ప.. పార్టీ కార్యక్రమం కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.