Begin typing your search above and press return to search.

రంజాన్ వేళ‌.. బాబుకు ఊహించ‌ని షాక్‌!

By:  Tupaki Desk   |   17 Jun 2018 5:16 AM GMT
రంజాన్ వేళ‌.. బాబుకు ఊహించ‌ని షాక్‌!
X
మాట‌ల‌కు చేత‌ల‌కు సంబంధం లేన‌ట్లుగా మాట్లాడే అల‌వాటు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబులో ఎక్కువే. ఆయ‌న తీరుతో ఆగ్ర‌హంతో ఉన్న ఏపీ ప్ర‌జ‌లు.. త‌మ‌కేమాత్రం అవ‌కాశం ల‌భించినా త‌మ నిర‌స‌న‌ను బ‌య‌ట‌కు వెళ్ల‌గ‌క్కుతున్నారు. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి చోటు చేసుకొని సీఎం చంద్ర‌బాబుకు భారీ షాక్ ను ఇచ్చింది.

రంజాన్ సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో న‌మాజ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ ప్రోగ్రాంకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల్గొన్నారు. పండ‌గ సంద‌ర్భంగా పాల్గొన‌టానికి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి అంద‌రికి శుభాకాంక్ష‌లు చెప్పి..మైనార్టీల‌కు ఏమేం చేయాల్సి ఉందంటూ అడిగితే ప‌రిస్థితి మ‌రోలా ఉండేదేమో. అలా కాకుండా మైనార్టీల‌కు త‌మ ప్ర‌భుత్వం ఎంతో చేస్తుందంటూ గొప్ప‌లు చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు.

దీంతో.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మ‌సీదు సంర‌క్ష‌ణ క‌మిటీ అధ్య‌క్షుడు నూరుద్దీన్ లేచి.. విజ‌య‌వాడ‌లోని రామ‌వ‌ర‌ప్పాడులో కూల్చిన మ‌సీదు పున‌ర్ నిర్మాణం సంగ‌తేంటి? అంటూ నిల‌దీశారు. ఊహించ‌ని రీతిలో వ‌చ్చిన ఈ ప్ర‌శ్న‌కు బాబు కంగుతిన్నారు. అప్ప‌టివ‌ర‌కూ మైనార్టీల‌కు తానెంతో చేసిన‌ట్లుగా చెప్పుకున్న బాబు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు. త‌న ప‌క్క‌నే క‌లెక్ట‌ర్ ఉన్నార‌ని.. నెల రోజుల్లో మ‌సీదును పూర్తి చేయాల‌ని ఆదేశిస్తాన‌ని చెప్పారు. దీనికి ప్ర‌తిగా ప‌లువురు ముస్లింలు చంద్ర‌బాబు మాట‌పై నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

రెండేళ్లుగా తాము పోరాడుతున్నా ఫ‌లితం లేద‌న్న మాట‌ను వారు చెప్పారు. కృష్ణా పుష్క‌రాల స‌మ‌యంలో నేష‌న‌ల్ హైవేను విస్త‌రించే క్ర‌మంలో ఆల‌యాలు.. మ‌సీదుల్ని బాబు స‌ర్కారు కూల్చేసింది. దీనిపై తీవ్ర ఆగ్ర‌హాం వ్య‌క్త‌మైంది. రంజాన్ సంద‌ర్భంగా నిర్వ‌హించిన న‌మాజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బాబుకు.. తాజా ప‌రిణామం షాకింగ్ గా మారింది. బాబును మ‌రిన్ని ప్ర‌శ్న‌ల‌తో నిల‌దీసే ప్ర‌య‌త్నం చేసిన నూరుద్దీన్ ను పోలీసులు ప‌క్క‌కు తీసుకెళ్లారు. దీనిపై ముస్లింలు ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. బాబు బ‌డాయి మాట‌లు మైనార్టీల‌కు మ‌రింత మంట పుట్టించాయ‌న్న మాట వినిపిస్తోంది.