Begin typing your search above and press return to search.

ఏపీకి మోడీ ఎలాగో సీమకు చంద్రబాబు అలా..

By:  Tupaki Desk   |   28 July 2016 6:52 AM GMT
ఏపీకి మోడీ ఎలాగో సీమకు చంద్రబాబు అలా..
X
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఎంతో చేశామంటూ గోరంత సాయాన్ని కొండంతలుగా చెప్పుకొంటున్న కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాయలసీమ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వ్యవహరిస్తున్నారు. ఏమీ లేకుండానే ఎంతో ఇచ్చామని చెబుతున్నారు. అయినా.. సీమ ప్రజలు నమ్మకపోవడంతో మరోసారి బలంగా చెప్పేందుకు గాను స్వాతంత్ర్య దినోత్సవాన్ని వేదికగా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఈసారి కూడా రాయలసీమలోనే స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రెండోసారీ రాయలసీమలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు నిర్వహించడంద్వారా ఆ ప్రాంతంలో తన ప్రభుత్వంపై సీమ వస్తున్న అసంతృప్తిని తొలగించే ఎత్తుగడకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కర్నూలులో తొలి స్వాతంత్య్ర ఉత్సవాలు నిర్వహించిన బాబు ఈసారి ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్రలో నిర్వహించాల్సి ఉంది. కానీ మళ్లీ రాయలసీమలోనే నిర్వహించడం వెనుక భారీ రాజకీయ వ్యూహమే కనిపిస్తోంది. విభజన జరిగిన తర్వాత రాజధాని ఎక్కడో నిర్ధారణ కాని పరిస్థితుల్లో బాబు ప్రభుత్వం 2014లో కర్నూలులో కోటిన్నర రూపాయల ఖర్చుతో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరిపింది. రాజధానిని కర్నూలులోనే ఏర్పాటుచేయాలన్న డిమాండ్ సీమవాసుల నుంచి వినిపించింది. శ్రీబాగ్ ఒప్పందాన్ని కూడా పలువురు నేతలు గుర్తుచేశారు. ఆ డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని స్వాతంత్య్ర సంబరాలు కర్నూలులోనే నిర్వహించారు. ఆ సందర్భంగా రాయలసీమను మెగా ఇండస్ట్రియల్ హబ్‌ గా ఏర్పాటుచేస్తామని బాబు ప్రకటించారు. అదే సభలో దాదాపు 40వేల కోట్ల రూపాయల వ్యయంతో పలు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

రాజధానిని గుంటూరు-విజయవాడ మధ్య ప్రకటించిన తర్వాత రెండో స్వాతంత్య్ర ఉత్సవాలను 2015లో విజయవాడలో నిర్వహించారు. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ ప్రకారంగా ఈసారి ఉత్తరాంధ్రలో నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ బాబు హఠాత్తుగా వ్యూహం మార్చారు. కొద్దినెలల నుంచి రాయలసీమలో అలజడులు మళ్లీ మొదలయ్యాయి. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ పై సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్న డిమాండును మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఆ మేరకు శ్రీశైలంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు భారీ ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ కొద్దిరోజుల నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రొద్దుటూరులో నిర్వహించిన ధర్నా కూడా సక్సెస్ అయింది. మరోవైపు బిజెపి నేతలు కూడా సీమపై దృష్టి సారించారు. త్వరలో కడపలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. సోము వీర్రాజు - పురంధ్రీశ్వరి - కన్నా - సురేష్‌ రెడ్డి వంటి సీనియర్లంతా సీమలో తరచూ పర్యటిస్తున్నారు.

చంద్రబాబు మాత్రం కోస్తా ప్రాంతం మీదే దృష్టి సారిస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిని ఏర్పాటుచేయగా - గుంటూరులో హైకోర్టును ఏర్పాటుచేశారని - ఇప్పుడు కూడా అదేవిధంగా కర్నూలులో హైకోర్టును ఏర్పాటుచేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. రాయలసీమకు ఇచ్చిన ప్రాజెక్టులు కూడా కోస్తాకు తరలించుకు వెళుతున్నారన్న ఆందోళన సీమవాసుల్లో మొదలయింది. ఈ డిమాండ్లు సీమ ప్రజలను ప్రభావితం చేస్తున్నాయన్న వాస్తవాన్ని గ్రహించిన బాబు - స్వాతంత్య్ర దినోత్సవాన్ని సీమలో నిర్వహించడం ద్వారా, సీమ ప్రజలపై తన ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకునే ఎత్తుగడకు తెరలేపారని తెలుస్తోంది. ఇందుకు గాను ఆయన భారీ కసరత్తు చేస్తున్నారని.. సీమకు రానున్న ప్రాజెక్టులను బాబు వెల్లడిస్తారని చెబుతున్నారు. ఇప్పటివరకూ వివిధ కంపెనీలతో జరిగిన ఒప్పందాల వివరాల జాబితాను రూపొందించాలని ఇప్పటికే చంద్రబాబు తన కార్యాలయ అధికారులను ఆదేశించారట. ఇక అనంతపురంలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవాల్లో దాన్ని చదవడమే తరువాయి. ఏపీని మోసం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి... సీమను మోసగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాని తేడా ఏమిటో మరి?