Begin typing your search above and press return to search.

కేంద్రానికి కట్టు బానిసలా ఏపీ ప్రభుత్వం

By:  Tupaki Desk   |   24 Jan 2017 5:30 PM GMT
కేంద్రానికి కట్టు బానిసలా ఏపీ ప్రభుత్వం
X
తమను పాలించమని పవర్ ను ప్రజలు ఎందుకిస్తారు? తమ జీవితాలు బాగుపడాలని.. భవిష్యత్ తరాలు మరింత మెరుగైన జీవనాన్ని జీవించాలనుకుంటారు. అదేం దరిద్రమో కానీ.. పవర్ ఇచ్చిన ప్రజలు కాకుండా.. ఢిల్లీలో కొలువు తీరిన ప్రభుత్వానికి కట్టుబానిసలుగా ఉండటానికి ఇష్టపడుతుంటాయి ఏపీ ప్రభుత్వాలు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రభుత్వంలో కొలువు తీరిన కాంగ్రెస్ నేతలు కావొచ్చు.. ఈ రోజు ఏపీకి తెలుగుదేశం ప్రభుత్వం కాని. విభజన నేపథ్యంలో ఏపీకి జరిగిన నష్టాన్ని సర్దుబాటు చేయటానికి వీలుగా.. ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ మాటిచ్చారు. ఆ సమయంలో విపక్షంలో వెంకయ్య నాయుడు లాంటి వాళ్లు అయితే.. తాము పవర్ లోకి వచ్చేస్తున్నామని.. వచ్చిన వెంటనే ఐదేళ్లుకాదు.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని బీరాలు పలికారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ సైతం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పటమే కాదు.. ఢిల్లీకి మించిన రాజధానిని ఏపీకి ఏర్పాటు చేస్తామని మాటలు చెప్పి ఊరించేలా చేశారు. కాబోయే దేశ ప్రధానే ఏపీకి అండగా ఉండనున్నాడన్న భ్రమల్ని కల్పించారు. ఇంతా చేసి అధికారంలోకివచ్చిన తర్వాత ఏపీని ఆరో వేలుగా చూశారే తప్పించి.. ప్రచార సమయంలో చెప్పినట్లుగా పెద్దపీట వేయనే వేయలేదు.

విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని చెప్పి.. ఎవరికి ఎలాంటి న్యాయం చేయని చంద్రబాబు.. ఎన్నికల సమయంలో ఏపీకి ఎంతో చేస్తానని.. ఏపీ ప్రజల సంక్షేమం తప్పించి తనకింకేమీ అక్కర్లేదని అదే పనిగా చెప్పేవారు. అయ్యగారి ట్రాక్ రికార్డు కంటే కూడా.. సీనియార్టీని ప్రాతిపదికగా తీసుకున్న ప్రజలు ఏపీ అధికార పీఠం మీద కూర్చోబెట్టారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారపక్షంలోకి రాగానే మరోలా వ్యవహరించే బాబు తీరు.. కొద్దిరోజులకే బయటకు వచ్చేసింది. ఏపీకి ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా విషయంలో మొదట్లో గట్టిగా ఉన్నట్లుగా కనిపించిన బాబు.. ఓట్లకు నోటు కేసుతో కేంద్రానికి జీ హుజూర్ అన్నట్లుగా మారిపోయారు. ప్రత్యేక హోదా లేదు.. ప్యాకేజీ అంటే గంగిరెద్దు మాదిరి తలూపిన ఆయన.. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలన్న మాట నోటి నుంచి వచ్చిన మరుక్షణం.. గొడవలు పెట్టుకోవటమేనా? డెవలప్ మెంట్ అక్కర్లేదా? అంటూ ఎదురుప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. విభజన సమయంలో ఏపీ ప్రజలకు ఘోర అన్యాయం చేసిందని కాంగ్రెస్ పై విరుచుకుపడే చంద్రబాబు.. తాను మాత్రం చేస్తున్నదేమిటన్న ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది.

విభజన సమయంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రానికి గులాంగిరి చేస్తే.. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు.. కేంద్రంలో కొలువు తీరిన మోడీ ప్రభుత్వం దగ్గర కట్టుబానిసత్వం చేయటమే కాదు.. వారేం చెబితే జీహుజూర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రోళ్లు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజల దరిద్రం ఏమో కానీ.. రాష్ట్రాన్ని పాలించే అధికారపక్షం ప్రజల గురించి ఆలోచించే కన్నా.. కేంద్రానికి కోపం రాకుండా చూసుకోవటంపైనే అధిక ప్రాధాన్యత ప్రదర్శించటం కనిపిస్తుంది. పక్కనున్న తమిళనాడును చూస్తే.. జల్లికట్టు ఉదంతంపై అధికార.. విపక్షాలు అన్ని కలిసికట్టుగా పోరాడాయి. తమకు ప్రజల ఆరాటమే తప్పించి.. మరింకేమీ అక్కరర్లేదన్నట్లుగా వ్యవహరించే తమిళ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఏపీ అధికారపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నాయి. ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ విపక్షాలు వైఎస్సార్ కాంగ్రెస్.. కాంగ్రెస్ పార్టీలతో పాటు మిగిలిన అన్నీ పార్టీలు కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడందరికి మంట పుట్టించేలా చేస్తుందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/