Begin typing your search above and press return to search.

ఎంపీకి చంద్ర‌బాబు వార్నింగ్‌

By:  Tupaki Desk   |   29 July 2016 1:27 PM GMT
ఎంపీకి చంద్ర‌బాబు వార్నింగ్‌
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు సాక్షిగా టీడీపీ త‌మ్ముళ్లు రెచ్చిపోయారు. ఓ వైపు ఎంపీ వ‌ర్గం - మ‌రోవైపు పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ చార్జ్‌ ల వ‌ర్గాలు ఎవ‌రికి వారు పోటాపోటీగా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయాల‌ని డిసైడ్ అవ్వ‌డంతో పాటు ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే ప‌బ్లిక్‌ గా ఈ గొడ‌వ జ‌ర‌గ‌గా చిర్రెత్తుకొచ్చిన చంద్ర‌బాబు ఎంపీతో పాటు ఆయ‌న వ‌ర్గీయుల‌పై ఫైర్ అయ్యారు. శుక్ర‌వారం చంద్ర‌బాబు వ‌నం-మ‌నం కార్య‌క్ర‌మంలో భాగంగా కృష్ణా జిల్లా నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలోని సుంకొల్లులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భావేదిక‌పై నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇన్‌చార్జ్ ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావును స్టేజ్ మీద‌కు పిల‌వ‌డంతో ఏలూరు ఎంపీ మాగంటి బాబు వ‌ర్గీయులు స్టేజ్ వ‌ద్ద తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న తెలిపారు.

ముద్ద‌ర‌బోయిన‌ను స్టేజ్‌ మీద‌కు ఆహ్వానించ‌వ‌ద్దంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి ప్ర‌తిగా ముద్ద‌ర‌బోయిన వ‌ర్గీయులు సైతం నినాదాలు చేశారు. దీంతో చంద్ర‌బాబు మాగంటితో పాటు ఆయ‌న వ‌ర్గీయుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాస్త‌వానికి ఏలూరు ఎంపీ మాగంటిబాబుకు - నూజివీడు ఇన్‌ చార్జ్ ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావుకు మ‌ధ్య గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల నుంచే తీవ్ర‌స్థాయిలో విబేధాలు ఉన్నాయి. మ‌ద్ద‌ర‌బోయిన చివ‌రి క్ష‌ణంలో పార్టీలోకి వ‌చ్చి టిక్కెట్టు ద‌క్కించుకున్నారు. ఎన్నిక‌ల టైంలో కూడా ఇద్ద‌రూ ముభావంగానే ప్ర‌చారం చేశారు.

ఎన్నిక‌ల‌య్యాక ఇద్ద‌రూ వేర్వేరు వ‌ర్గాల‌ను ప్రోత్స‌హించ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది. తాజాగా బాబు ప‌ర్య‌ట‌న సాక్షిగా ఈ విబేధాలు మ‌రోసారి భ‌గ్గుమ‌న్నాయి. గ‌తంలోనే వీరిద్ద‌రు స‌వాళ్లు-ప్ర‌తి స‌వాళ్లు రువ్వుకున్నారు. వీరి మ‌ధ్య విబేధాల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో ఏఎంసీ చైర్మ‌న్ నియామ‌కం కూడా వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. ఎవ‌రికి వారు త‌మ వ‌ర్గానికి చెందిన వారికే ఏఎంసీ చైర్మ‌న్ ఇప్పించుకోవాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌తంలోనే ఈ ఇద్ద‌రి నేత‌లు స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళ్లాల‌ని చంద్ర‌బాబు సూచించినా ఆయ‌న మాట‌లు గాలిమీద నీటిమూట‌ల‌య్యాయి. ఇక తాజాగా బాబు ముందే మాగంటి వ‌ర్గీయులు చేసిన హంగామా ఆయ‌న‌కు కోపం తెప్పించ‌డంతో చంద్ర‌బాబు ఎంపీ మాగంటితో పాటు ఆయ‌న వ‌ర్గీయుల‌పై తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు.