Begin typing your search above and press return to search.

వైకాపా నాసిర‌కం స‌రుకు

By:  Tupaki Desk   |   1 Sep 2015 3:59 PM GMT
వైకాపా నాసిర‌కం స‌రుకు
X
టీఆర్ ఎస్‌, వైకాపా రెండు ఒక్క‌టే ...టీడీపీని, న‌న్ను బ‌ద్నాం చేసేందుకు ఈ రెండు పార్టీలు క‌లిసిక‌ట్టుగా కుట్ర చేస్తున్నాయంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు మండిప‌డ్డారు. తెలంగాణ‌లో వైకాపాకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యే ల‌ను సీఎం కేసీఆర్ కొనుగోలు చేస్తే మ‌రో ఎమ్మెల్యే ను జ‌గ‌న్ బోస‌స్‌ గా ఇచ్చార‌ని చంద్ర‌బాబు ఎద్దేవా చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు బీహార్ త‌ర‌హాలో ప్యాకేజీ ఇస్తే తీవ్ర న‌ష్టం క‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. మంగ‌ళ‌వారం అసెంబ్లీ వాయిదా ప‌డిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వైకాపా పెద్ద నాసిర‌కం స‌రుకులాంటిద‌ని విమ‌ర్శించారు.

జ‌గ‌న్‌కు రాష్ర్ట ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు అస్స‌లు ప‌ట్ట‌వ‌ని, కుమ్మ‌క్కు రాజ‌కీయాలతోనే ఆయ‌న కాలం గ‌డిపేస్తార‌ని బాబు అన్నారు. ఓటుకు నోటు కేసు వెన‌క జ‌గ‌న్ హ‌స్తం స్ప‌ష్టంగా ఉంద‌న్నారు. జ‌గ‌న్‌కు బంధువైన ఎమ్మెల్సీ స్టీఫెన్‌ స‌న్‌ ను ఎమ్మెల్యే గా చేయాల‌ని జ‌గ‌నే స్య‌యంగా కేసీఆర్‌కు లేఖ రాశార‌ని బాబు ఆరోపించారు.

ఇక నిప్పులాగా బ‌తికిన త‌న‌పై ఎన్ని చెత్త కేసులు పెట్టినా త‌న‌నేం చేయ‌లేర‌న్నారు. జ‌గన్‌ తండ్రి వైఎస్‌ తనపై కేసులు పెట్టి సుప్రీం కోర్టు వరకు వెళ్లినా అవి నిలవలేదని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. తనకు వ్యతిరేకంగా జగన్‌, టీఆర్‌ ఎస్‌ ఎన్ని కుట్రలు ప‌న్నినా ఏమీ కాదని ఆయన అన్నారు. కుమ్మ‌క్కు, ద‌గాకోరు రాజ‌కీయాల‌ను తాను ధీటుగా ఎదుర్కొంటాన‌ని చంద్ర‌బాబు అన్నారు.