Begin typing your search above and press return to search.

ప్రతిపక్ష నేతను ఇంట్లో కూర్చోమన్న బాబు

By:  Tupaki Desk   |   28 May 2016 11:27 AM GMT
ప్రతిపక్ష నేతను ఇంట్లో కూర్చోమన్న బాబు
X
తిరుపతిలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు కార్యక్రమంలో రెండో రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ విపక్ష నేత జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి గురించి చెప్పుకొచ్చే సమయంలో.. అమరావతి కలల రాజధానిగా అభివర్ణించిన ఆయన.. రాజధానిపై సీమాంధ్ర ప్రజలు పెట్టుకున్న ఆశల్ని తీరుస్తామన్నారు. ఎక్స్ ప్రెస్ హైవేను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజల కలల రాజధానిని తాము నిర్మిస్తుంటే.. ప్రతిపక్ష నేత జగన్ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడిన ఆయన.. జగన్ విమర్శల్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీ రాజధానికి పెట్టిన అమరావతి పేరును ఒక్కరు కూడా వ్యతిరేకించలేదన్నారు. ఏపీ రాజధానిని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తమకు విపక్ష నేత సహకరించాలని.. ఒకవేళ అలా చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలంటూ మండిపడ్డారు. ప్రపంచంలోనే గొప్ప రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని చెప్పిన ఆయన.. ఇండియా అంటే అమరావతి గుర్తుకు వచ్చేలా రాజధాని నగరాన్ని నిర్మిస్తామని వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణానికి ఎవరు అడ్డుపడినా తాము మాత్రం అద్భుతంగా నిర్మిస్తామని చెబుతున్నచంద్రబాబు.. ఏపీ రాజధానిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మించేందుకు వీలుగా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు. అమరావతిని అత్యున్నతంగా నిర్మిస్తామని చంద్రబాబు చెప్పటం తప్పు కాదు కానీ.. ఇండియా అన్న వెంటనే అమరావతి గుర్తుకు వచ్చేలా చేస్తామంటూ చెబుతున్న మాటలు కాస్త అతిశయాన్ని కలిగించేలా ఉన్నాయని చెప్పక తప్పదు.