Begin typing your search above and press return to search.

జగన్ కు చంద్రబాబు థ్యాంక్స్ చెప్పాలా?

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:40 AM GMT
జగన్ కు చంద్రబాబు థ్యాంక్స్ చెప్పాలా?
X
విపక్ష అధినేత అధికారపక్షాన్ని మాటలతో చితక్కొట్టేయటం మామూలే. అయితే.. ఆ మాటల్లో నిజం లేదని.. అదంతా ప్రభుత్వాన్ని దెబ్బ తీసేలా రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపిస్తుంటారు. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి ఏపీలో చోటు చేసుకుంది. జగన్ అనే మూడు అక్షరాలు విన్నంతనే విపరీతమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసే చంద్రబాబు తాజాగా జగన్ వ్యాఖ్యల్ని సమర్థించేలా వ్యవహరించటం ఆసక్తికరంగా మారింది. విపక్ష నేతను తరచూ తిట్టేసే అధికారపక్ష నేతల తీరుపై ఇప్పుడు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు బ్యాంకులు రుణాలుఇవ్వటం లేదంటూ.. ఇటీవల గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అదే స‌మ‌యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయ‌న‌ కడిగేయటం తెలిసిందే. ఈ సందర్భంగా రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదని.. రుణాలు ఇవ్వకుండా ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మాటల్ని పలువురు టీడీపీ నేతలు ఖండించారు. జగన్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదని వాదించారు. కుట్రపూరితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తిట్టేసిన తెలుగు తమ్ముళ్లు ఉన్నారు.

అయితే.. చంద్రబాబు మాత్రం జగన్ మాటల్ని సీరియస్ గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. బుధవారం కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. బ్యాంకర్లు ఇస్తున్న రుణాల గురించి ఆరా తీయటం.. రైతుల్లో 50 శాతం కంటే తక్కువ మందికే బ్యాంకులు రుణాలు మంజూరు చేసిన విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం.. విజయనగరం.. తూర్పు..పశ్చిమ గోదావరి..కర్నూలు.. కడప తదితర జిల్లాల్లో బ్యాంకర్లు చాలాతక్కువ మంది రైతులకు మాత్రమే రుణాలు ఇవ్వటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఉన్నా వారికి బ్యాంకులు రుణాలుఇవ్వటం లేదంటూ చంద్రబాబు దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. దీనిపై సీరియస్ అయిన చంద్రబాబు బ్యాంకర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అవసరమైతే ఈ అంశంపై రిజర్వ్ బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఫసల్ బీమా పథకంలో పెట్టిన రూల్స్ రైతులకు ఇబ్బందిగా.. బ్యాంకులకు అనుకూలంగా ఉన్నాయన్న‌ అదికారుల మాటకు స్పందించిన ఆయన.. ఈ అంశాన్ని.. రైతులకు రుణాలు ఇవ్వని తీరుపై ప్రధానితో మాట్లాడతానని చెప్పారు. ఇందుకు సంబంధించిన నివేదికను సిద్ధం చేయాలని చంద్రబాబు కోరారు.

రైతుల విషయంలో బ్యాంకులు అనుసరిస్తున్న వైనాన్ని జగన్ ఘాటుగా చెప్పే వరకూ బాబు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏమైనా.. తాజా ఎపిసోడ్ లో జగన్ కు చంద్రబాబు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆయనే కానీ.. తీవ్రస్థాయిలో రైతులకు రుణాలివ్వని బ్యాంకుల అంశాన్ని తెరమీదకు తీసుకురాకుంటే.. ముఖ్యమంత్రి ఈ అంశం మీద దృష్టి పెట్టేవారే కాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. సో.. ప్రతిపక్ష నేత రాజకీయమే కాదు.. ప్రజా సమస్యల్ని కూడా మాట్లాడతారన్న అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తిస్తే బాగుంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/