Begin typing your search above and press return to search.

టీడీపీ ప్రకటించబోయే ఎంపీల జాబితా ఇదేనా?

By:  Tupaki Desk   |   21 Feb 2019 7:31 AM GMT
టీడీపీ ప్రకటించబోయే ఎంపీల జాబితా ఇదేనా?
X
పార్లమెంట్ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిసారించారు. ఏపీలోని 25 ఎంపీ స్థానాలకుగాను చంద్రబాబు మొదటి జాబితాలో 9మంది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.ఈసారి కేంద్రంలో చక్రం తిప్పాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపిక విషయంలో పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు. ఎక్కువ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అభ్యర్థుల జాబితాను రెడీ చేసినట్టు సమాచారం.

మొదటి జాబితాలో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా పని చేస్తున్న పుసపాటి అశోక్ గజపతి రాజుకు విజయనగరం ఎంపీ టికెట్ ఖరారైందని తెలుస్తోంది. అశోక్ గజపతి ఉత్తరాంధ్ర పార్టీకి పెద్దదిక్కుగా - టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2014లో విజయనగరం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయనను మళ్లీ ఇక్కడి నుంచి బరిలో దింపాలని టీడీపీ భావిస్తోంది.

శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా కె. రాంమోహన్ నాయుడిని తిరిగి బరిలో దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే అమలాపురం ఎంపీ స్థానానికి దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి తనయుడు హరీష్ ను బరిలో దింపాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టు సమాచారం. విజయవాడ ఎంపీ స్థానానికి కేశినేని నానిని - కడప నుంచి మంత్రి ఆదినారాయణను బరిలో దింపనున్నారని సమాచారం.

గుంటూరు ఎంపీ స్థానానికి గల్లా జయదేవ్ - కర్నూల్ ఎంపీ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ - నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి కుటుంబంలో ఒకరి అవకాశం - ప్రకాశం జిల్లా బాపట్ల ఎంపీ అభ్యర్థిగా శ్రీరామ్ మల్యాద్రికి తిరిగి అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం.

ఇక కీలకమైన ఏలూరు ఎంపీ స్థానంలో మాజీ ఎంపీ - సర్వేల కింగ్ లగడపాటి రాజగోపాల్ ని టీడీపీ తరుఫున బరిలోకి దింపాలని బాబు యోచిస్తున్నట్టు సమాచారం. లగడపాటిని టీడీపీలో చేర్చుకొని ఇక్కడ నుంచి గెలుపించుకోవాలని బాబు భావిస్తున్నాడట.. ఇక్కడ వైసీపీ నుంచి కావూరి సాంబశివరావు నిలబడే అవకాశాలు ఉండడంతో కావూరికి గట్టి పోటీదారుగా లగడపాటిని దించబోతున్నట్టు తెలుస్తోంది.

మొదటి జాబితాలో 9మంది పేర్లను ఖారారు చేసిన చంద్రబాబు రెండో - మూడో జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికను పక్కా వ్యూహంతో ఖరారు చేస్తున్నారు. కేంద్రంలో రాబోయే ప్రభుత్వాన్ని తానే నిర్ణయించాలని ఆయన భావిస్తున్నారు. త్వరలోనే ఎంపీ అభ్యర్థుల తుదిజాబితా బాబు ఖరారు చేసి ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేసే పనిలో కసరత్తు చేస్తున్నారు.