Begin typing your search above and press return to search.

దీక్ష ముగిస్తూ..క‌వరేజీపై బెంగ‌ప‌డిన బాబు

By:  Tupaki Desk   |   20 April 2018 5:29 PM GMT
దీక్ష ముగిస్తూ..క‌వరేజీపై బెంగ‌ప‌డిన బాబు
X
ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో చేపట్టిన ధర్మ పోరాట దీక్ష ముగిసింది. అనంత‌రం ఈ సంద‌ర్భంగా ఓవైపు త‌న దీక్ష గురించి వివ‌రిస్తూనే..మ‌రోవైపు త‌న దీక్ష‌కు మైలేజీ రాకుండా ప‌వ‌న్ అడ్డుప‌డ్డార‌ని చంద్ర‌బాబు ఆక్షేపించారు. చంద్ర‌బాబు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ప్రజల తరఫున దీక్ష చేశాన‌ని తెలిపారు. రాజకీయ పార్టీలు సైతం రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. పటేల్ విగ్రహానికయ్యే ఖర్చు కూడా రాజధానికి అవ్వదా అని ప్రశ్నించారు చంద్రబాబు. ఢిల్లీని మించిన కేపిటల్‌ నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోడీ.. ఇప్పుడు అసూయతో ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారని అయితే ఎట్టి పరిస్థితుల్లోను అమరావతి నిర్మాణం ఆగదని అన్నారు.

కేంద్రం విషయంలో పెద్దలు చెప్పిన మాటనే తాను ఫాలో అయ్యానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సామ - దాన - బేధ - దండోపాయాల్ని ప్రయోగించానన్నారు. అన్ని మార్గాలు మూసుకుపోవడంతో పోరాటం మొదలుపెట్టానని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు వివ‌రించారు. ఎవ్వరూ తనని చెప్పుచేతల్లో పెట్టుకోలేరని అన్నారు. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగితే.. అందుకు తగ్గట్టు బదులిస్తామన్నారు చంద్రబాబు. కర్నాటక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పై ఫోకస్‌ చేసే అవకాశం లేకపోలేదన్నారు. త‌ద్వారా ఆప‌రేష‌న్ గ‌రుడ‌పై ప‌రోక్షంగా చంద్ర‌బాబు స్పందించారు. ఒకసారి పోరాటం మొదలుపెట్టాక.. భయపడి వెనక్కు తిరిగే పరిస్థితి లేదని చంద్ర‌బాబు అన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు కౌంట‌ర్ ఇస్తూనే త‌న‌కు క‌వ‌రేజీ ద‌క్క‌లేద‌నే అభిప్రాయాన్ని పంచుకున్నారు.

హైద‌రాబాద్‌ లోని ఫిలించాంబ‌ర్‌ కు వెళ్లిన సినీన‌టుడు - జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కు త‌న‌పై జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ళం విప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌రిణామంపై చంద్ర‌బాబు ఆస‌క్తిక‌రంగా స్పందించారు. `వ్యక్తిగత సమస్యలపై స్పందనకు ఈరోజే సరైనదా? రేపు చేయొచ్చు కదా? ` అంటూ ప‌వ‌న్‌పై ప‌రోక్షంగా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. రాష్ట్రం కోసం దీక్ష చేపడితే దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆక్షేపించారు. కాగా, త‌న దీక్ష కంటే ప‌వ‌న్ ఆందోళ‌న‌పైనే చంద్ర‌బాబు ఎక్కువ ఫోక‌స్ పెట్టిన‌ట్ల‌యింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.